మాచర్ల మంటలు ఆరకుండానే 'మరో మంటలు'?
గుంటూరు జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘటన కలకలం రేకెత్తించింది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్న అన్న క్యాంటీన్ భవనంలో మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మంటల్ని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నసమయంలో అన్న క్యాంటిన్ అదే భవనంలో ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూతపడింది. ఒకవైపు మాచర్లలో టీడీపీ-వైసీపీ మధ్య మంటలు రేగుతునన సమయంలో ఈ భవనానికి మంట పెట్టింది ఎవరు? అనే విషయం తేలాల్సి ఉంది.
విధ్వంసం! విధ్వంసం! విధ్వంసం!
— TDP Digital Media (@TDPDigitalMedia) December 18, 2022
తెనాలి మార్కెట్ ఏరియాలోని అన్న క్యాంటీన్ భవనానికి నిప్పు పెట్టిన ఆగంతకులు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకువెళుతున్నాడు జగన్ రెడ్డి? ఆలోచించు ఆంధ్రుడా..!#AnnaCanteen #APInUnsafeHands #JaganPaniAyipoyindhi #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/co3kJi1Rrm
వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా.. టీడీపీ వారే మంటలు పెట్టుకొని వైసీపీపై బురద చల్లుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టి ఉంటారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్న క్యాంటిన్లను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి రోజుల్లో ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తర్వాత అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలనుకుందికానీ ఓటమిపాలవడంతో అన్న క్యాంటిన్లు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకులు తమ సొంత ఖర్చుతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులకు, వైసీపీ నాయకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తెనాలిలో అన్న క్యాంటిన్ కు నిప్పు పెట్టిన ఘటనలో పూర్తి వివరాలు బయటకు వస్తేకానీ అసలు విషయాలు వెల్లడికావు.