తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం - ఉచిత బస్సులో మంటలు..!!
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి భక్తులను ఉచిత రవాణా సేవలు అందించే శ్రీవారి ధర్మరధంలో మంటలు చెలరేగాయి. అలిపిరి నుంచి తిరుమల వెళ్తున్న దేవస్థానం బస్సులో మంటలు రావటంతో ఆందోళన మొదలైంది. చివరి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు నుండి కిందకు దిగిడంతో ప్రాణప్రాయం తప్పింది. బాధితులు ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమచారం అందుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు నుంచి డిజిల్ లీకై ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దాని పైన అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులక క్రితం తిరుమల ఘాట్రోడ్డులో ఓ కారులోనూ మంటలు చెలరేగిన విషయాన్ని సిబ్బంది గుర్తు చేస్తున్నారు. వారాంతం కావటంతో కొండ పైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
భక్తులకు శ్రీవారి దర్శనం కోసం వారంతంలో టీటీడీ వీఐపీ లేఖలను రద్దు చేసింది. ఛైర్మన్ సుబ్బారెడ్డి రెండు రోజులగా క్యూ లైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న సేవల పైన ఆరా తీస్తున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు చేసారు. ఎవరూ 28వ తేదీన వీఐపీ లేఖలతో రావద్దని టీటీడీ సూచించింది. ఇక, ఈ బస్సు ప్రమాదం పైన టీటీడీ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు.