ఉలిక్కిపడ్డ తిరుపతి: పేలుళ్లకు ముక్కలు ముక్కలైన మైనర్.. పెను విషాదం..
పేలుళ్ల ధాటికి ఇద్దరూ మైనర్ బాలుళ్లు ప్రాణాలు కోల్పోగా.. ఇందులో ఓ బాలుడు ముక్కలు ముక్కలై దాదాపు 200మీ. ఎత్తున ఎగిరిపడ్డాడు.
తిరుపతి: అనుమతులు లేకుండా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బాణసంచా తయారుచేస్తున్న ఓ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుళ్ల ధాటికి ఇద్దరూ మైనర్ బాలుళ్లు ప్రాణాలు కోల్పోగా.. ఇందులో ఓ బాలుడు ముక్కలు ముక్కలై దాదాపు 200మీ. ఎత్తున ఎగిరిపడ్డాడు.
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడతో తిరుపతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పద్మావతీ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో స్థానికంగా ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది.
అక్రమంగా బాణసంచా తయారీ:
తిరుపతిలో నివాసముంటున్న శేషయ్య అనే వ్యక్తికి పద్మావతీ నగర్ లో కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని నగరానికే చెందిన ఖల్ నాయక్ అనే వ్యక్తికి కారు పార్కింగ్ కోసం ఏడాదిన్నర క్రితం అద్దెకు ఇచ్చాడు. అయితే ఖల్ నాయక్ మాత్రం కారు పార్కింగ్ బదులు ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాడు.
పేలుడు జరిగిందిలా:
ఆదివారం నాడు ఇద్దరు బాల కార్మికులు, ఓ యువతి బాణసంచా తయారుచేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా లోపల మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే పేలుళ్లు సంభవించడంతో.. మైనర్ బాలుడు ఒకరు 200మీ. ఎత్తున ఎగిరిపడ్డాడు. తప్పించుకునే క్రమంలో మరో బాలుడు బయటకు పరిగెత్తుకు రాగా.. తీవ్ర గాయాలపాలై తయారీకేంద్రం ఎదుటే మృతిచెందాడు. ధనలక్ష్మి అనే యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను స్థానిక రుయా ఆసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు:
పుత్తూరు సమీపంలోని పాలసముద్రం బాలకృష్ణాపురానికి చెందిన శివయ్య,, వల్లెమ్మకు నలుగురు సంతానం.ఇందులో పుడియలం మంజు(13) ఒకరు. చదువు మీద శ్రద్ద పెట్టకపోవడంతో అతన్ని పనిలో చేర్పించారు. 6నెలల క్రితం ఖల్ నాయక్ అనే వ్యక్తి తమను సంప్రదించి.. బాలుడిని పనికి పంపించాలంటూ కోరడంతో.. అందుకు వారు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
మంజు పద్మావతి నగర్ లో పనికి కుదరగా.. అతని తల్లిదండ్రులు కూడా కాటన్ మిల్ సమీపంలోని రాజీవ్ గాంధీ కాలనీలో అద్దెకు దిగారు. శివయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక రెండో మణికంఠ (14) వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను గొల్లవానికుంటకు చెందిన ధనలక్ష్మి(28)గా గుర్తించారు.
దెబ్బతిన్న ఇళ్లు:
గోడౌన్ లో సంభవించిన పేలుడుతో దాని పైకప్పు 150మీ. మేర పైకెగిరి పక్కన ఉన్న ఇళ్ల మీద పడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 200మీ. దూరంలో ఉన్న ఇళ్ల కిటీకీలు, అద్దాలు కూడా పగిలిపోయాయి. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులను బడికి తరలిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. తాజా ఘటనలో ఇద్దరు మైనర్లు చనిపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందంటున్నారు.