ఏపీకి రూ.1000 కోట్లివ్వండి: ఎంపీ తోట, వర్షాకాలంగా మారిన శీతాకాలం!
న్యూఢిల్లీ: గత నెలలో భారీ వర్షాల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇందుకోసం రూ.వెయ్యి కోట్లను తక్షణ సాయంగా ఇవ్వాలని కాకినాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తోట నర్సింహం బుధవారం అన్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సంపై లోకసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నవంబర్ నెల మధ్యలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
నవంబర్ 14వ తేదీ నుంచి 22 తేదీ వరకు ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా పంట నష్టం అధికంగా జరిగిందన్నారు. వర్షాల వల్ల రూ.3,819 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితిపై ప్రధానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశారని చెప్పారు. భారీ నష్టం కారణంగా ఏపీకి తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్నారు. మరోవైపు, తమిళనాడులో తాజా వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకె ఎంపీ వెంకటేష్ బాబు అన్నారు.
ఏపీలో శీతాకాలం కాస్తా వర్షాకాలంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది.












Click it and Unblock the Notifications