ఆ చట్టాన్ని రద్దు చెయ్యాలి ..సీఎం జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే లేఖ
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాజధానిలో బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంత రైతులు నుండి బలవంతంగా భూసేకరణ చేశారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేసిందని ఎమ్మెల్యే ఆర్ కె ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులను భూమి ఇవ్వాలని వేధింపులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఏటా 5 పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఇక గత టిడిపి ప్రభుత్వం భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులకు గురి చేసిందని,కేసులు బనాయించిందని,అంతేకాదు వారి పంటలు సైతం తగులబెట్టించారు అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి కి రాసిన లేఖలో వివరించారు.
అందుకే గత ప్రభుత్వం రాజధానిలో అమలు చేసిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన లేఖ రాసినట్లుగా పేర్కొన్నారు. ఇక అంతే కాదు రాజధాని నిర్మాణానికి అమరావతి భూములు అనుకూలం కాదని శివరామ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేసి రైతులకు నరక యాతన చూపించిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బలవంతంగా భూములు తీసుకొని అనుకూలత లేనిచోట రాజధాని నిర్మాణం చేపట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.