ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత: ఫిజిక్స్పై బుక్
అమరావతి: రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బయ్యారపు ప్రసాద రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు వికాస్, కుమార్తె సౌమ్య ఉన్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో ఉంటోన్నారు. గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రసాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా ఉన్నారు. పలు కీలక హోదాల్లో పని చేశారు. సౌమ్ముడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
1979 కేడర్, ఏపీ బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన. గుంటూరుజిల్లా నరసరావు పేట ఆయన స్వస్థలం. ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థి ఆయన. ఐపీఎస్లో చేరడానికి ముందు ఐఐటి-మద్రాస్లో చదువుకున్నారు. ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రసాద రావు 1979లో సివిల్స్ పరీక్షలను రాశారు. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలుజిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు. విజిలెన్స్ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు.

కొంతకాలం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండెంట్గా పనిచేశారు. అనంతరం డీజీగా పదోన్నతి పొందిన తరువాత ఏలూరు, కర్నూలు రేంజ్ డీఐజీ, అవినీతి నిరోధక విభాగం అదనపు డైరెక్టర్గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. సెక్యూరిటీ వింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డీఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఛైర్మన్ అండ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఒకవంక ఆయా పదవుల్లో కొనసాగుతూనే ఫిజిక్స్పై పరిశోధనలు సాగించారు. పదవీ విరమణ అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. తాను చేసిన పరిశోధనలతో వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకాన్ని రాశారు.












Click it and Unblock the Notifications