పెరుగు, చేపలపై జీఎస్టీ విధిస్తుంటే జగన్ సర్కార్ మౌనం- టీడీపీ నేత యనమల విమర్శలు
నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపించింది. అయితే పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదన నెగ్గలేదు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపు సహా పలు అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ లో ఏపీ ప్రభుత్వం నిర్ధిష్ట హామీలు సాధించుకోలేకపోవడంపై టీడీపీ నేత, మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
జీఎస్టీ కౌవ్సిల్ భేటీలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై ఇవాళ మాజీ మంత్రి యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ రెడ్డి తన అవినీతి కేసులు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని యనమల విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్ లో ప్రజలపై భారాలు మోపుతున్నా వైసీపీ ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు పొడింగించాలని చిన్న చిన్న రాష్ట్రాలు సైతం గళం విప్పాయి. కేంద్రాన్ని ప్రశ్నించాయని, కానీ ఏపీ ఆర్ధికమంత్రి మాత్రం మౌనంగా ఉండిపోయారన్నారు.
జీఎస్టీతో నష్టపోయిన రాష్ట్రాలకు ఆదాయంలో కొంతభాగం చెల్లించాలని జీఎస్టీ చట్టంలోనే ఉందని యనమల గుర్తుచేశారు.చట్టపరంగా రావాల్సిన హక్కులను సైతం అడగలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం భాధాకరమన్నారు. జగన్ రెడ్డి, ఆర్ధికమంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకే నిర్ణయించుకున్నారని మాజీ ఆర్ధిక మంత్రి విమర్శించారు. ప్రజలపై భారాలు పడకుండా చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.
పెరుగు, తేనె, చేపలు, మాంసం వంటి ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధిస్తామన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు పలకడం దుర్మార్గమని యనమల ఆరోపించారు.జీఎస్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు తెలుపుతూ ఇచ్చిన నివేదిక బహిర్గతం చేయాలన్నారు. రైతులపై భారం పెంచేలా ఎలక్ట్రిక్ పంపులు, మిషన్ల పై ఉన్న పన్నును 12 నుంచి 18శాతానికి పెంచినా గానీ మాట్లాడలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని యనమల విమర్శించారు.