పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తే వైసీపీకి డిపాజిట్ గల్లంతే: మాజీ మంత్రి చినరాజప్ప
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ సభా వేదికగా ప్రకటించగా దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పొత్తులతో ఉమ్మడిగా పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదేనని వైసిపి వ్యాఖ్యానిస్తోంది. బిజెపిని టిడిపిని కలపడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు. చంద్రబాబుకు మళ్ళీ అధికారం కట్టబెట్టటం కోసం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు.
పవన్ వ్యాఖ్యలను సమర్ధించిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వైయస్ జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని ఓడించాలని కోరుకుంటున్నారని నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా జనసేనాని సభలో ఇదే విషయాన్ని వెల్లడించారని పేర్కొన్న ఆయన ప్రజలను ఈ ప్రభుత్వం పెడుతున్న హింస నుంచి గట్టెక్కించాలని అందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
పొత్తుల విషయంలో టీడీపీ అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది
తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మాజీ హోంమంత్రి, టిడిపి సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచేసిందని మండిపడిన నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి విధ్వంసం నుంచి కాపాడటానికి పవన్ కళ్యాణ్ చేసిన సూచనను ఆలోచించాల్సిన అవసరం ఉందని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటే ఏపీలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన ఆయన ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటే ఏపీలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాక్షస పాలన అంతం అవ్వాలంటే అంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారని, ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అంటూ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు . పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భయపడి మంత్రులు పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని చినరాజప్ప మండిపడ్డారు.
Recommended Video
వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా చూస్తామని పవన్ వ్యాఖ్యలు .. కొత్త సమీకరణాలు
ఇదిలా ఉంటే గతానికి భిన్నంగా ఈసారి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తాజా సభ ద్వారా జనసేన అజెండా ప్రకటించి ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలను వెల్లడించారు. ఉద్యోగుల విషయంలోనూ జనసేన స్టాండ్ ఏమిటో చెప్పిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా వైసీపీ సర్కార్ ను ఓడించటం కోసం వ్యతిరేక ఓట్లను చీల్చకుండా చూస్తామని పేర్కొన్నారు. జగన్ పై సమరం చేస్తామని అని తన వ్యాఖ్యలతో తేల్చి చెప్పారు. ఇక ఈ వ్యాఖ్యలే ఏపీలో కొత్త సమీకరణాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.