వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేశారన్న మాజీ మంత్రి పీతల సుజాత
వైయస్సార్ ఆసరా పథకాన్ని ఈరోజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీల భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మహిళలకు సంబంధించిన రుణాలను నాలుగు విడతలుగా చెల్లిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . వైయస్సార్ ఆసరా పథకంపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేశారని ఆమె మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ ఇస్తే, ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి 87 లక్షల మందికే పథకాన్ని కుదించారని పీతల సుజాత ఆరోపించారు . టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ కలిపి 21 వేల కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం టిడిపి పాత పథకాలకు పేరు మార్చి హడావుడి చేస్తుందని ఆమె విమర్శించారు.

నాడు టిడిపి ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు ఇస్తే, నేడు జగన్ సర్కార్ ఇచ్చింది 6,792 కోట్లు మాత్రమేనని పీతల సుజాత పేర్కొన్నారు.
టిడిపి పాలనతో పోలిస్తే, ప్రస్తుతం వైసిపి పాలనలో ఆరు లక్షల మంది మహిళలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారని పీతల సుజాత మండిపడ్డారు.ఆసరా మొండిబకాయిలకు మాత్రమే వర్తింప చేస్తున్నారని పేర్కొన్న సుజాత, వలసదారులకు ఆసరా పథకాన్ని దూరం చేస్తున్నారని ఆరోపించారు.
వలసదారులకు, రుణాలు చెల్లించిన వారికి కూడా ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో, క్రిమినల్ మైండ్ సెట్ తో మహిళా సంఘాలను వంచన చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ రాక్షసత్వాన్ని ఎదిరిస్తామని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎదుటివారిపై నెట్టే నీతిమాలిన రాజకీయాలను వైసిపి నాయకులు మానుకోవాలి అంటూ మాజీ మంత్రి హితవు పలికారు.












Click it and Unblock the Notifications