జగన్ సింహం కాదు; గ్రామసింహం తోక ఎవరూ పట్టుకోరు: మాజీమంత్రి సోమిరెడ్డి ఎటాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల పొత్తులపై ఇప్పటినుండే ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, తాజాగా చంద్రబాబు పొత్తులపై చేసిన వ్యాఖ్యలు, మళ్లీ మరోమారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో జనసేన, టిడిపిల మధ్య పొత్తు పొడుస్తుంది అన్న చర్చ జరుగుతుంది. ఇక పొత్తుల విషయంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ... పొత్తులపై జనసేనపైనా విమర్శలు
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడం తెలియదని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేడని, టిడిపి ఎంతగా బలహీనమైనదో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రెండు పార్టీలు కలిసి పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పడం రాజకీయ వ్యభిచారం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసిపితో ఏ పార్టీ కలిసి రాదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఇక వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పొత్తుల విషయంలో మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎదురు దాడికి దిగారు. వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసిపి పక్కన నిలబడటానికి ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని ఆరోపణలు గుప్పించారు. గోదాట్లో కొట్టుకుపోతున్న గ్రామసింహం తోక ఎవరూ పట్టుకోరు అనే నిజాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కప్పి పెడుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతల మాటలు విని జనం నవ్వుకుంటున్నారు : మాజీ మంత్రి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం కాదు, ఆ పార్టీతో ఎవరూ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని ఆయన తేల్చి చెప్పారు. జగన్ పాలన చూశాక ఎవరూ ఆ పార్టీతో చెయ్యి కలపటానికి ముందుకు రారని వెల్లడించారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇక వారి మాటలు విన్న జనాలు నవ్వుకుంటున్నారు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
జగన్ వైఎస్సార్ కంటే గొప్పవాడేమీ కాదు
వైయస్సార్ గతంలో పొత్తులు పెట్టుకోలేదా అని ప్రశ్నించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ తన తండ్రి వైఎస్సార్ కంటే గొప్ప వాడు ఏమీ కాదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీని జనం తరిమి కొడతారని వ్యాఖ్యలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అందుకే వైసీపీతో ఎవరూ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం లేదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అందరితో కలుపుకుపోయే నాయకుడు కాబట్టి, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అందరూ ఇష్టపడతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.