99 శాతం హామీలు అమలైతే చంద్రబాబు సవాల్ ను స్వీకరించలేదే- బోండా ఉమ సూటి ప్రశ్న..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశానంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ వాటిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. దీనిపై సీఎం జగన్ 24 గంటలైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ జగన్ అర్జునుడు కాదు, ఉత్తర కుమారుడంటూ వ్యాఖ్యానించారు.
జగన్ నిజాయితీ పరుడైతే, రాప్తాడు సభలో చెప్పినవన్నీ నిజాలైతే చంద్రబాబు సవాల్ పై 24 గంటలైనా ఎందుకు స్పందించలేదని బోండా ఉమ ప్రశ్నించారు. రాప్తాడు సభలో కల్తీమద్యం తాగి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని, చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నారన్నారు. చంద్రబాబు అంటే అభివృద్ధి, సంక్షేమం అని, జగన్ రెడ్డి అంటే జైలు, విధ్వంసమని బోండా అభివర్ణించారు.

99 శాతం హామీలు జగన్ రెడ్డి ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చారోప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమని బోండా ఉమ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి వస్తారో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. రత్యేకహోదా, మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, రైతులకు గిట్టుబాటుధర, బీసీలకు చట్టబద్ధమైన సబ్ ప్లాన్, కాపు కార్పొరేషన్ కు ఎక్కువ నిధులు సహా అనేక హామీలపై ప్రజల ముందే జగన్ రెడ్డి నోరు విప్పేలా చేస్తామని బోండా ఉమ హెచ్చరించారు. జగన్ రెడ్డి అర్జునుడు కాదని, ఉత్తరకుమారుడని, ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజల్ని మోసగించగడం తప్ప ఏమీ చేయలేడన్నారు.












Click it and Unblock the Notifications