జగన్ కూ, చంద్రబాబుకూ తేడా అదే-ఉద్యోగుల హామీలు నిలబెట్టుకున్నామన్న పేర్నినాని..
వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే 99 శాతం హమీల్ని తమ ప్రభుత్వం అమలు చేసిందని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు 2004 తర్వాత ఉద్యోగం పొందిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ గతంలో ఇచ్చిన మాట ప్రకారం జగన్
సీపీఎస్ రద్దు చేశారన్నారు. ఈ బృహత్తర నిర్ణయంతో తాము ఎన్నికల మ్యానిఫెస్టోను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామనేది అర్థమౌతోందని పేర్ని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేననన్నారు.
14 ఏళ్లపాటు సీఎంగా అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై ఏవేవో కోతలు కోశాడని పేర్నినాని ఆరోపించారు. ఉద్యోగులందరికీ భ్రమలు కల్పించి ఏమైనా చేశాడా..? అంటే, చేతులెత్తేశాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబుకు ప్రజలు గానీ, వారికి ఇచ్చిన హామీలు గానీ గుర్తుకురావని, అదే అధికారం పోగానే కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నింటినీ చెప్పగల నేర్పరితనం ఆయనదని అన్నారు.

ఏపీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఒకటో పీఆర్సీ నుంచి 11వ పీఆర్సీ వరకు ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు చేయకుండా ఏ ప్రభుత్వమైనా అమలు చేసిందా అని పేర్నినాని ప్రశ్నించారు. ఉద్యోగులంతా దీన్ని గుర్తించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వమైనా మీరు అడక్కుండానే పీఆర్సీ కమిటీని నియామకం చేయడం, అమలు చేసిన పరిస్థితి ఉంటే సమాధానం చెప్పమని ఆయన అడిగారు. కానీ, ఈరోజున ఉద్యోగులెవరూ రోడ్డెక్కకుండానే, నిరసనలు తెలపకుండానే 12వ పీఆర్సీ అమలుకు కమిటీ నియామకం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఇదికదా, అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ, ప్రజల ప్రభుత్వమని పేర్నినాని వ్యాఖ్యానించారు. మా నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడో అందరూ గుర్తించాల్సిన సందర్భం ఇదేకదా అని గర్వంగా చెబుతున్నానని పేర్ని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలత, సానుభూతిని ప్రదర్శించడమంటే ఇదేకదా.. ? . జగన్గారి ప్రభుత్వానికి చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ఉద్యోగస్తులంతా పోల్చి చూసుకోవాలన్నారు.

ఇప్పటిదాకా జగన్ పై లేనిపోని ఆరోపణలతో బురదజల్లే విమర్శలు చేస్తూ దూషణ చేసిన కొన్ని ఉద్యోగ సంఘాల్ని, ఆయా సంఘాల నాయకుల్ని వారి గుండెలపై చేయ్యేసుకుని అంతరాత్మను ప్రశ్నించుకోవాల్సిందిగా పేర్ని కోరారు. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూలంగా, సానుభూతితో పనిచేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఒక్క మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గారు, ఆ తర్వాత జగన్ తప్పితే అనేది ఆలోచించాలన్నారు.
మరోవైపు లోకేశ్ ఏ పార్టీకి అధ్యక్షుడూ కాదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదని, కనీసం సర్పంచిగా కూడా గెలవనటువంటి ఆయనకు భద్రత కరువైందని టీడీపీ నేతలు చెప్పడంలో అర్థమేమైనా ఉందా అని పేర్ని ప్రశ్నించారు. పవన్కళ్యాణ్, కేఏ పాల్ మాదిరిగా ఏదొక చిన్నపార్టీకి అధ్యక్షుడు కూడా కాదు కదా అని సెటైర్లు వేశారు. వాళ్ల పార్టీ కార్యకర్తలే సెల్ఫీ దిగలేదని లోకేశ్ను కోడిగుడ్లతో కొట్టారంట. ఇదేం విడ్డూరం. సెల్ఫీఫోటో ఇవ్వకపోతే రాళ్లు, కోడిగుడ్లుతో నాయకుల్ని కొట్టే కార్యకర్తలు వాళ్ల పార్టీలో ఉన్నారా, మీపార్టీ వాళ్లు మిమ్మల్ని కోడిగుడ్లు విసిరి దాడి చేస్తే.. మేం ప్రభుత్వం తరఫున భద్రత పెంచడమేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications