నా వల్లే తెలంగాణ ఇలా, కేంద్రం తక్కువ చేసింది: బాబు, నాలుగేళ్ల బాలుడి రూ.50వేల విరాళం
విజయవాడ: తాను ముందుచూపుతో సమైక్య ఏపీలో ఐటీని అభివృద్ధి చేశానని, తన వల్లే ఇప్పుడు తెలంగాణకు ఆదాయం వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం సహకరించాలని ఆయన అన్నారు.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నయన టిడిపిలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సుజయ సోదరులతో పాటు వైసిపి తరఫున గెలిచిన 58 మంది ఎంపీటీసీలు, 85 సర్పంచులు, ముగ్గురు జెడ్పీటీసీలు.. ఇంకా చాలామంది టిడిపిలో చేరారు.
బాబు మాట్లాడుతూ.. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారన్నారు. జనాభా నిష్పత్తిలో ఆదాయం పంచలేదన్నారు. విభజన శాస్త్రీయంగా జరగలేదని పేర్కొన్నారు. రూ.24వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. అప్పు చేయాలన్నా మనం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
కనీసం పద్ధతి లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. నాలెడ్జ్ సిటీగా హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. ఇప్పుడు ఏపీలో రాజధాని లేదని, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏవీ లేవన్నారు. రెండేళ్లుగా నిరంతర కృషితో ఆదాయాన్ని 2.35 శాతం పెంచుకున్నామన్నారు.
కేంద్రం చాలా చేయాల్సి ఉంది.. కొద్దిగా చేశారు
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. విభజన చాలా దారుణంగా జరిగిందన్నారు. విభజన హామీలను కూడా కేంద్రం చాలా వాటిని అమలు చేయాల్సి ఉందని, కానీ కొద్దిగే చేశారని చెప్పారు. తాను ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి సహాయం కోరుతున్నానని చెప్పారు.
అందరితో మాట్లాడాకే రాష్ట్ర విభజన చేయాలని తాను ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వద్ద డిమాండ్ చేశానని చెప్పారు. విభజన వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు నా వల్లే ఆదాయం
నేను 1995లో ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆదాయం లేదని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. నేను దూరదృష్టితో ఐటికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. తాను ఆ రోజు చేసిన పని వల్ల ఈ రోజు తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు.
తెలంగాణతో విభజన వల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అలాగే కేంద్రం కూడా మనకు సహకరించాలన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు మనకు అండగా నిలబడాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. అందరం సమష్టిగా కష్టపడదామన్నారు.
సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని చెప్పారు. నేను ఎప్పుడూ అభిమానించే జిల్లా విజయనగరం జిల్లా అన్నారు. ఇది మంచి జిల్లా అన్నారు. కానీ ఒకరు చెడబుట్టి చెడగొట్టారని వైసిపి నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వలసలు ఆగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మనం పని చేద్దామన్నారు.
రాజధానికి రూ.50వేల విరాళం ఇచ్చిన నాలుగేళ్ల బాలుడు
రాజధాని అమరావతి నిర్మాణం కోసం విజయవాడ గుణదలకు చెందిన నాలుగేళ్ల బాలుడు మండల హర్షిత్ రూ.50వేల విరాళం ఇచ్చారు. అతను సీఎం చంద్రబాబుకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ బాబును ఎత్తుకొని ఆనందించారు. బాబుతో పాటు అతని తల్లిదండ్రులను ప్రశంసించారు.