అసెంబ్లీలో రగడ: ఆ 'నలుగురు' వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసుల్లేవ్!
అమరావతి: వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగలేదు. సభ ప్రారంభం నుంచి వైసిపి ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టి హోదా కోసం నినదించారు.
విపక్ష ఎమ్మెల్యేల తీరు పైన స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైసిపి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశ పెట్టారు.
గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటై వీడియోలను పరిశీలించింది. వైసిపి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 16 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు 12 మందికే నోటీసులు జారీ చేశారు. నలుగురికి నోటీసులు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ కేబినెట్ తీర్మానాలు
మంగళవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్కు భూమి ఇవ్వాలని నిర్ణయించింది. 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేబినెట్ తెలిపింది. కర్నూలు, అనంతపురం, ఎస్పీఎస్ నెల్లూరు, కాకినాడలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయనున్నారు.
అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థలోకి హిందూపురం, కాకినాడ- రాజమండ్రి నగరాలతో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం అన్ని నియోజకవర్గాల్లో వంద ఎకరాల్లో పారిశ్రామిక పార్క్లు నిర్మాణం చేపడతామన్నారు. దోమలపై దండయాత్రకు కార్యాచరణ రూపొందించనున్నారు. శ్రీలంక పద్ధతిలో అయిదంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరువు, భూగర్భ జలమట్టం వంటి అంశాలపై చర్చించారు.