ఏపీలో మే 1 నుంచి కాదు, జూన్ నుంచి 18ఏళ్ల దాటినవారికి వ్యాక్సిన్: ఎందుకంటే..?
అమరావతి: దేశ వ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ కార్యక్రమం మే 1 నుంచి కాకుండా జూన్ నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఏపీలో జూన్ నుంచి 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ అందుకే..
18 ఏళ్లు నిండినవారంతా టీకా వేయించుకోవడానికి కరోనా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. అంతేగాక, వ్యాక్సిన్ పంపిణీ కోసం తాము సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఒప్పందాలు జరగలేదని తెలిపారు. వీటిపై స్పష్టత వచ్చేందుకు కూడా కొంత సమయం పడుతుందని సింఘాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ కారణంగానే మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు పంపిణీ జరగదని, పేర్ల నమోదు సమయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే కఠిన చర్యలు
కరోనా చికిత్సలో కీలకమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ ను ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అందిస్తామని సింఘాల్ తెలిపారు. వాటిని బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా అధికారులు అనుమతిచ్చిన ప్రైవేటు ఆస్పత్రులకు వారు జిల్లాల్లో ఉండే డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇలా సోమవారం 11,453 ఇంజెక్షన్లు, ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేశామని చెప్పారు. సంబంధిత వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 32,810 ఇంజెక్షన్లు ఉన్నాయన్నారు. ఇక ఈ వారంలోగా మరో 50వేలు వస్తాయన్నారు. తాము 4 లక్షల ఇంజెక్షన్లకు ఆర్డర్లు పెట్టినట్లు సింఘాల్ తెలిపారు. రెమిడిసివిర్ అక్రమ విక్రయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయముంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందరూ కరోనా నిబంధనలు పాటించాలి..
కరోనా వ్యాప్తిగా వేగంగా జరుగుతున్నందున పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలలో 50 మంది పాల్గొనడానికే అనుమతి ఉంటుందని సింఘాల్ తెలిపారు. ఈ విషయంలో జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ లు మూసేసినట్లు చెప్పారు. ప్రజా రవాణా, సినిమా హాళ్లు శాతం సీట్ల సామర్థ్యంతోనే పనిచేస్తాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యుగులో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. కాగా, ఏపీలో కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే