నేటి నుంచి సంక్రాంతి సెలవులు: ఒక్కసారిగా రైళ్లు, బస్సుల్లో రద్దీ.. వెయిటింగ్ లిస్ట్ దాటేశారు.. ఊరిక
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు ముందు రెండో శనివారంతో కలిపితే నాలుగు రోజులు సెలవులు. సాధారణంగానే సంక్రాంతి, దసరా పండుగలకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడతాయి. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ జరపుకునేందుకు కోస్తాంధ్రలోని దూర ప్రాంత రెగ్యులర్ రైళ్లలో రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేకరైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలా రైళ్లలో నిరీక్షణ జాబితా (వెయిటింగ్ లిస్ట్) పరిమితి కూడా దాటిపోయింది.
బెర్తు, సీటు దొరక్కపోయినా నిల్చొనైనా వెళ్దామనుకున్నా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడమెలా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్తోపాటు కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. శుక్ర, శనివారం ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది.

ఊరటనిస్తున్న జన సాధారణ్ రైళ్లు
రెగ్యులర్ రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ చెబుతున్నా రద్దీకి ఇవి ఏమాత్రం చాలడం లేదు. 12, 13తేదీల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జన్మభూమి, విశాఖ, గరీభ్రథ్, ఎల్టీటీ, ఈస్ట్కోస్ట్ రైళ్లలో రిజర్వేషన్ రిగ్రెట్ (వెయిటింగ్ లిస్ట్ దాటి)కు చేరుకుంది. హంసఫర్, విశాఖపట్నం ప్రత్యేకరైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 12న రాజమహేంద్రవరానికి 4 ప్రత్యేకరైళ్లు సహా 17, 13న ఒకటి ప్రత్యేకరైలు సహా 13 రైళ్లు ఉన్నా అన్నింట్లో నిరీక్షణ జాబితా దాటింది. కాకినాడకు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేకరైళ్లలోనూ ఇదే పరిస్థితి. 11, 12 తేదీల్లో ముందస్తు రిజర్వేషన్ అవసరం లేని జనసాధారణ్ రైళ్లు రెండు నడపడం ఒక్కటే ఊరట. నెల్లూరు, గూడురు వైపు వెళ్లే రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లో ఉంది.

జనరల్ బోగీల్లో ఇబ్బందికరంగా ప్రయాణం
సికింద్రాబాద్ వైపు నుంచి విశాఖపట్నం, కాకినాడ, గూడూరు వైపు బుధ, గురువారాల్లో వెళ్లిన..శుక్ర, శనివారాల్లో వెళ్లే ప్రత్యేకరైళ్ల సంఖ్య చూస్తే సగటున నాలుగైదు రైళ్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రైళ్లు చాలావరకు పండగ ముగిశాక, తిరుగు ప్రయాణమూ ముగిసిన తర్వాత ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో తిప్పే రైళ్లను..కేరళ, ఇతర రాష్ట్రాలకు పండగలతో సంబంధం లేకుండా నడిపే వీక్లీ ప్రత్యేకరైళ్లను ఈ జాబితాలో కలిపేసింది. మరోవైపు రిజర్వేషన్ బోగీల్లో నిరీక్షణ జాబితా టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో మిగిలింది జనరల్ బోగీలే. సాధారణ రోజుల్లోనే సీటు దొరకని ఈ బోగీల్లో ఇప్పుడు మరింత ఇబ్బందికరంగాగా మారింది. ఎప్పటిలాగే ఈస్ట్కోస్ట్ రైల్వే ఈసారి కూడా అదనపు రైళ్లు నడపడం లేదని ప్రకటించింది.

ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
ఆర్టీసీ బస్సుల్లోనూ రెగ్యులర్తోపాటు 50 శాతం అదనపుఛార్జీలతో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ 12, 13తేదీల్లో వెయిటింగ్ లిస్ట్ ( ఒక్కో బస్సులో గరిష్ఠంగా ఐదు టికెట్లు) పరిమితి దాటింది. అటు ఆర్టీసీలో, ఇటు రైళ్లలో టికెట్లు దొరక్క ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు మూడొంతుల ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కాగా, పండగ సమయాల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్మన్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ గురువారం సీఎస్ ఎస్పీసింగ్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునిల్ శర్మలను కోరారు. ఆర్టీసీ కంటే రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

టోల్గేట్ల దగ్గర ట్రాఫిక్ జాం
నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి, నకిరేకల్ - సూర్యాపేట టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జాం అయింది. నేషనల్ హైవేపై పంతంగి, నకిరేకల్ - సూర్యాపేట టోల్ ప్లాజాలు ఏర్పాటుచేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు మొత్తం ఈ టోల్గేట్ల మీదుగానే వెళ్లాలి. దీంతో రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రస్తుతం శుక్రవారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడం, శనివారం రెండో శనివారం సెలవు కావడంతో ఇక పండుగకు సొంత ఊళ్ళకు పెద్దఎత్తున తరలి వెళుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications