నిధులు పక్కదారి పడితే వ్యవస్థ కుప్పకూలుతుంది: చంద్రబాబు
విజయవాడ: నిధులు పక్కదారి పడితే వ్యవస్థ కుప్పకూలుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉంటే అభివృద్ధి సవ్యదిశలో సాగుతుందని ఆయన అన్నారు. వృద్ధి, సంక్షేమాల మధ్య సమన్వయం చేసుకోవడం కత్తి మీద సాము అని ఆయన అన్నారు. విజయవాడలోని గేట్వేలో శనివారం రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు
పరిశ్రమల మిషన్పై ఆయన మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ ర్యాకింగ్లో రాష్ట్రానికి రెండో స్థానం ఇవ్వడం, పట్టిసీమ పూర్తి చేసి నదులను అనుసంధానం చేయడం వల్ల అధికారులు, ప్రజల్లో విశ్వాసం పెంచగలిగామని ఆయన అన్నారు. సమిష్టిగా పనిచేసిన శాఖల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు పరిశ్రమల శాఖే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశ్రమల అనుమతుల కోసం రాష్ట్రం అనుసరిస్తున్న ఏకగవాక్ష విధానం, విదేశీ పర్యటనలు ప్రభావం చూపిస్తాయని చెప్పారు. బృందంగా పనిచేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఆయన చెప్పారు. సుదీర్ఘమైన సముద్ర తీరం, సహజ వనరులు రాష్ట్రానికి కలిసి వచ్చే అంశాలని చెప్పారు.
కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో భాగస్వామి అవుతూ ఎపిఐఐసి పటిష్టమైన సంస్థగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications