ప్రాణాలు పోతున్నాయ్! ఏం మాట్లాడుతున్నారు: గాలి వర్సెస్ కామినేని
Recommended Video
అమరావతి: బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య మాటల యుద్ధం జరిగింది. జిల్లాలో ప్రజలు రోగాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య అధికారుల్లో చలనం లేకుండా పోయిందని గాలి అన్నారు.
ప్రాణాలు పోతున్నాయ్..
డెంగ్యూ, అంటు వ్యాధులతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదని గాలి ముద్దుకృష్ణమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేగాక, జిల్లాలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో చెన్నై, బెంగళూరుకు ప్రజలు వెళుతున్నారని తెలిపారు.
9ఏళ్ల నుంచి ఆమే ఎందుకు?.. భారీ స్కాంలు
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి గత 9 ఏళ్లుగా ఈ జిల్లాలోనే పని చేస్తున్నారని... ఉపాధ్యాయులను కూడా రెండు మూడేళ్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని, కానీ ఆమెను ఇదే జిల్లాలో ఎందుకు ఉంచారని మంత్రిని గాలి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెడాల్ అనే కంపెనీకి అప్పగించారని... మెడాల్ పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారని గాలి ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయని అన్నారు.
ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?
గాలి ఆరోపణలపై మంత్రి కామినేని స్పందిస్తూ.. సంబంధం లేని విషయాలను ఎలా అడుగుతారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖపై మంగళవారం సభలో చర్చ జరిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా... ఇప్పుడు మాట్లాడితే ఎలాగని మంత్రి కామినేని ప్రశ్నించారు. తాను అన్ని ప్రశ్నలపై సమాధానం చెబుతానని అన్నారు. ప్రజలకు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలవరం.. ఏపీ జీవనాడి..
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, దాన్ని పూర్తి చేయడమే తన జీవితాశయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. తాను ఇప్పటివరకు 20సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్, స్పిల్వే పనులు 72శాతం, డయా ఫ్రం వాల్ పనులు 47.99శాతం, మట్టి పనులు 72 శాతం పూర్తయ్యాయని వివరించారు. అంతేగాక, రేడియల్ గేట్లు వంద శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.12,567.22కోట్ల పనులు పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.4,329కోట్లు వచ్చాయని, రూ.58,391.06కోట్లకు సవరించిన అంచనాలుకేంద్రానికి పంపించామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.