భార్యను వదిలేసి మద్యం కోసం వెళ్లాడు: ఆమెపై గ్యాంగ్ రేప్, 13 మందికి జైలు
నెల్లూరు: ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో 13 మందికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలేసి జరిమానా పడింది. మహిళను అపహరించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో నెల్లూరు నగర ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు.
నెల్లూరులోని రంగనాయకులపేట రైలువీధికి చెందిన ఓ వ్యక్తి 2009 జూన్ 13న తన భార్యతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో ఆత్మకూరు బస్టాండుకు వచ్చాడు. బస్టాండులో సమీపంలో ఆమెను నిలబడాలని చెప్పి, మద్యం కొనుక్కొనేందుకు దుకాణానికి వెళ్లాడు.
ఈ సమయంలో చిల్డ్రన్స్ పార్కు రోడ్డుకి చెందిన రాచపల్లి సుబ్రహ్మణ్యం, వెలగచెట్టు సంఘానికి చెందిన అల్లంపాటి వెంకటరమణ, రాకాలి వెంకటేశ్ అలియాస్ బక్కోడు, వల్లం విజయకుమార్ అలియాస్ విజవు, పసుపులేటి హరి అలియాస్ దాటోడు, చిత్తూరు శామ్యూల్ అలియాస్ గుండెకామ్, సర్వేపల్లి కాలువ కట్టకు చెందిన శివలింగం చంద్రకుమార్ అలియాస్ చందు ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పరారయ్యారు.
బాధితురాలి భర్త సదరు ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ చేసిన యువతిపై ఆ ఏడుగురు నిందితులు చింతారెడ్డిపాలెంలోని ఖాళీ ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఆతర్వాత హరనాథపురానికి చెందిన షేక్కరీముల్లా, బెంజి మధు, ఎల్లాపు అనోజ్, చెలిగల్వ మీరాలు అలియాస్ మీరా, వెలగచెట్టు సంఘంకు చెందిన కట్టెర్ల ప్రభు అలియాస్ నరసింహులు, బండారి శివ అలియాస్ అంగతిలకు కూడా ఫోన్ చేసి పిలిచారు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.
నిందితులు ఏదో విషయంపై గొడవ పడుతున్న సమయంలో బాధితురాలు తప్పించుకుంది. భర్తతో కలిసివెళ్లి రెండో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
మొదటి నిందితుడు రాచపల్లి సుబ్రహ్మణ్యంకు అదనంగా రూ.10వేలు, కిడ్నాప్ చేసిన అల్లంపాటి వెంకటరమణ, బక్కోడు, విజయ్, దాటోడు, గుండెకామ్, శివలింగం చంద్రకుమార్లకు అదనంగా మరో రూ. 10వేలు చొప్పున జరిమానా విధించారు. జరిమానా మొత్తం రూ.2 లక్షలను బాధితురాలికి అందజేయాలని తీర్పులో ఆదేశించారు.
ఓ వివాహితను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నెల్లూరు స్థానిక కోర్టు 13 మంది దోషులకు పదేళ్ల జైలు శిక్ష, పది వేల రూపాయలేసి జరిమానా విధిస్తూ మంగళవారంనాడు తీర్పు వెలువరించింది.