అసలైన కలెక్షన్ కింగ్: మోహన్ బాబుపై మంత్రి గంటా ప్రశంసలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పదని, పేదల కోసం కళాశాల నిర్మించి విద్యాదానం చేస్తున్న మోహన్బాబు నిజంగా కలెక్షన్ కింగ్ అని కొనియాడారు.
గురువారం సాయంత్రం మోహన్బాబుకు దాసరి స్వర్ణకంకణ ప్రదానోత్సవంలో ఘంటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు అందిస్తున్న సేవలపై ఘంటా ప్రశంసించారు. అంతకుముందు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎంతో మంది దర్శకులున్నా నటుడు, నిర్మాత, దర్శకుడు దాసరి ఒక్కరే అని అన్నారు.
మోహన్బాబుకు స్వర్ణకంకణ ప్రదానం నిజంగా గురుశిష్యుల అనుబంధానికి ప్రతీక అన్నారు. కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ టుడు శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ.. తెలుగులో ఎన్టీఆర్ అగ్రగణ్యుడని, ఆ కోవలో మోహన్బాబు వస్తారని అన్నారు.
దాసరి మాట్లాడుతూ... ద్రోణాచార్యుడికి ఎంతమంది శిష్యులున్నా అర్జునుడు ఒక్కడే ప్రియ శిశ్యుడని.. అలాగే తనకు మోహన్బాబు ఒక్కడే అన్నారు. రాజకీయాల్లోకి రాగానే చాలామంది స్నేహం మరిచిపోతారు కానీ, మరువనివాడు శత్రుఘ్న సిన్హా, మోహన్బాబు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు.
కాగా, చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని.. దర్శక, నిర్మాతగా అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 72వ జన్మదినోత్సవం సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో కలెక్షన్కింగ్, నిర్మాత, నటుడు మోహన్బాబుకు 'శృతిలయ- దర్శకరత్న' స్వర్ణకంకణాన్ని ప్రదానం చేశారు.
సన్మానోత్సవంలో శత్రుఘ్నసిన్హా, బి మురళి, తిరుమల బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్, ఎం హరికిషన్, డా. భీమ్రెడ్డి, డా. ధర్మారావు, జెబిరాజు పాల్గొన్నారు. 24 గంటలపాటు నిర్విరామ సంగీతాన్ని ప్రదర్శించిన ఎకె అయ్యంగార్ను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో హిమాన్షుచౌదరి కూచిపూడి నృత్యంతో అలరించగా, ఆమని, ప్రవీణ్కుమార్ తమ గానంతో ఆకట్టుకున్నారు.