కోర్టుకు: 1956 స్థానికతపై గంటా, కేసీఆర్పై ధ్వజం
హైదరాబాద్: 1956కు ముందు స్థానికత ఆధారంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు.
ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరతామని, అడ్వకేట్ జనరల్తో మాట్లాడానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
ఎవరు స్ధానికులన్న విషయాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం, ముల్కీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. వరుసగా నాలుగు సంవత్సరాలు ఉంటే వారు స్థానికులు అవుతారని తెలిపారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అమలు చేస్తామన్న 1956కు ముందటి స్థానికత అంశాన్ని భవిష్యత్తులో అడ్మిషన్లకు, ఉద్యోగాలకు కూడా వర్తింపజేసే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఇక్కడ పుట్టినవారందరు కూడా మావాళ్లేనని పేర్కొన్నారని, వారి కాల్లో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు కంటిలో ముల్లు గుచ్చుకున్నా పట్టించుకోవటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయంతో సీమాంధ్రకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
స్థానికత విషయంలో వారు అటు తెలంగాణకు, ఇటు ఏపీకి కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల కౌన్సెలింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే విషయమై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వ స్పందనను అడిగిందని, తమ అభ్యంతరాలు కోర్టులో తెలిపేందుకు సిద్ధమవుతున్నామన్నారు.