ఏపీలో 'ఉల్లి' కష్టాలు: ఆధార్ కార్డు తప్పనిసరి, కిలోమీటర్ల మేర క్యూలైన్లు
విజయవాడ: ఏపీలో ఉల్లి ధరలు చుక్కులను తాకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయలు కిలో ధర రూ. 40 నుంచి రూ. 50కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, రైతుబజార్ల ద్వారా కిలో రూ. 20కి అమ్మించాలని తలపెట్టినా, ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు.
అంతేకాదు ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలంటూ రైతుబజార్ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గంటల కొద్దీ లైన్లో నిలుచుంటే రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తున్నారని, వాటిల్లో సగం పాడైపోయినవే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు.
కాగా, విజయవాడ బందరురోడ్డులోని రైతుబజార్ వద్ద ఉల్లిపాయలు కొనుగోలు చేసే లైను రెండు కిలోమీటర్ల మేర ఉందని సమాచారం. ఇక గురువారం పటమట రైతు బజార్లో కిలో రూ. 20లకే కిలో ఉల్లిపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దళారుల కారణంగానే ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయని అన్నారు. ఉల్లి ధరలు తగ్గే వరకు కిలో రూ. 20కే విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయవాడలోని స్వరాజ్ మైదాన్లోని రైతు బజార్ను వ్యవసాయ శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబజార్లలో దళారీల వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉల్లి కొనుగోలు కేంద్రంలో వినియోగదారుల నుంచి ధరల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అధిక ధరలను వసూలు చేస్తే సహించేదిలేదని చెప్పారు.