ఆపదలో అండగా చంద్రబాబు - రాత్రి వేళ నడిరోడ్డుపై : తన కాన్వాయ్ లోనే..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. రాత్రి వేళ రోడ్డు మీదకు దిగి క్షతగాత్రులైన వారికి సాయం అందించారు. చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా.. తొలి విడత పర్యటన ముగించుకొని విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరారు. చీపురుపల్లి సభ తరువాత పయణమైన చంద్రబాబుకు శివారు ప్రాంతంలోని కనకమహాలక్ష్మీ దేవాలయం సమీపంలో రోడ్డు పైన ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ను ఆపమని సూచించారు.
రాత్రి సమయంలో నడి రోడ్డు మీద
ఆయన రోడ్డు మీద ఉన్న వారి వద్దకు వచ్చి వారి పరిస్థితిని వాకబు చేసారు. వారిద్దరూ చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లికి చెందిన వారుగా వెల్లడించారు. చంద్రబాబు సభకు వచ్చి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గా చెప్పారు. దీంతో..వెంటనే తన కాన్వాయ్ లోని అంబులెన్సులోనే వారిద్దరినీ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు.
వారిని అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించే వరకూ తోడుగా నిలిచారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న ఆ ఇద్దరినీ అంబులెన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇక, రాజకీయంగా వచ్చే ఎన్నికల పైన ఫోకస్ చేసిన చంద్రబాబు గతం కంటే భిన్నంగా వైసీపీ తో వ్యవహరిస్తున్నారు.
పర్యటనల్లో కొత్త జోష్ తో..
మహానాడు తో పార్టీ కేడర్ లో వచ్చిన జోష్ ను కొనసాగించేందుకు ముందుగానే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. వ్యూహాత్మకంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనల సమయంలో పార్టీ పరిస్థితులు..నేతల మధ్య సమన్వయం పైనా ఫోకస్ పెట్టారు. నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ముందుగానే పార్టీలో ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చేయటం..తానే రంగంలోకి దిగటం ద్వారా కేడర్ లో కొత్త ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు.
ఇక, తొలి పర్యటనలోనే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో వచ్చిన స్పందనతో పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు. ప్రధానంగా చోడవరం..తాజా చీపురుపల్లిలో చంద్రబాబు సభకు మంచి స్పందన కనిపించింది.
మాటల తూటాలతో టార్గెట్ వైసీపీ
ఇదే సమయంలో సీఎం జగన్..మూడేళ్ల పాలన..ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఏంటనేది వివరించి చెబుతున్నారు. వైసీపీ ప్రధాన అస్త్రంగా మలచుకుంటున్న సామాజిక న్యాయం అంశం పైన చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయం వరకూ ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు దీర్ఘకాలిక పర్యటనలతో ఎఫ్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాల పైన స్పందించటం.. పార్టీలో ఎక్కడనైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవటం.. పార్టీ కేడర్ - ప్రజలతో ఎక్కవగా మమేకం అవ్వటం లక్ష్యంగా ఏడాది టూర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే అంచనాలతో..చంద్రబాబు ముందస్తుగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.