RTC: మహిళల ఉచిత బస్సు పథకంపై అదిరిపోయే శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే దీపం 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ విషయంలో తాజాగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభవార్త చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తారని మొదట భావించినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ క్రమంలోనే ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం అప్పటి నుండే
వచ్చే సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే తాము హామీ ఇచ్చినట్టుగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పింఛన్లను పెంచి పంపిణీ చేస్తున్నామని, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ పైన తీవ్రవ్యాఖ్యలు చేసిన ఆయన తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ప్రభుత్వం పై మాట్లాడే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం కోసం ఏ ఒక్క పని చేయలేదన్నారు.
జగన్ మాటలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరు
ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా మిగిలిపోయిన వైసీపీ అధినేత జగన్ మాటలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో, ఐదు రోజులు బెంగుళూరు ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా ప్రజల మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలను అమలు చేసి ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.












Click it and Unblock the Notifications