ఏపీ రైతన్నలకు శుభవార్త .. ఆ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్న జగన్ సర్కార్
ఏపీ లోని జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది .ఆంధ్రప్రదేశ్లో తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే పనిలో పడింది . ప్రకృతి విపత్తుల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన రైతులకు బాసటగా నిలవాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించేలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు వారి ఖాతాలను 22 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు.
గులాబ్ సైక్లోన్ తో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ పరిహారం
2021 సెప్టెంబరులో సంభవించిన గులాబ్ సైక్లోన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ నష్టపరిహారాన్ని అందించనున్నట్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు. సచివాలయాలలో జాబితాలను ప్రదర్శించి రైతులకు నష్ట పరిహారాన్ని పంపిణీ చేస్తున్నారు.ఇక గత రెండు వారాలుగా పడుతున్న వర్షాలతో జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో ఇప్పటికే బృందాలను రంగంలోకి దించిన ఏపీ సర్కార్ రైతులకు అండగా ఉండటం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
రైతుల ఖాతాలలో పరిహారం జమ .. కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామన్న జగన్
మంగళవారం నాడు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఈ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రైతుల ఖాతాలో జమ చేసిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని, మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాదు గత పాలకులు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచించలేదని ఈరోజు తాము తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని జగన్ తెలిపారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే
తుఫానులు, వరదలు, కరువులు ఏవి వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒకవేళ అలాంటివి ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదే సీజన్లో పరిహారం ఇచ్చేలా కొత్త సంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి పారదర్శకతతో పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రెండు నెలల క్రితం వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రస్తుతం పరిహారం చెల్లిస్తున్నామని తెలిపిన జగన్ ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే తోడు ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నామని జగన్ పేర్కొన్నారు.
రైతన్నల సంక్షేమం కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు
రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెండు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పిన సీఎం ధాన్యం సేకరణ కోసం గత ప్రభుత్వం రెండు వందల అరవై కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఉంచిన వాటిని తాము చెల్లించామని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కింద 9 వేల కోట్ల కరెంట్ బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్ పెడితే తామే చెల్లించామని సీఎం జగన్ గుర్తు చేశారు. విత్తన బకాయిలు చెల్లించామనీ, రైతన్నలకు తోడుగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.