చెప్పాం.. చేసి తీరుతాం: నారా లోకేష్, సొంత వనరులతో..
హైదరాబాద్/విజయవాడ: తాము రుణమాఫీ చేస్తామని ఎప్పుడో చెప్పామని, తాము చెప్పినట్లుగానే కచ్చితంగా దానిని అమలు చేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ గురువారం అన్నారు. రుణమాఫీకి, రీషెడ్యూల్కు ఆర్బీఐ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు మంత్రులు, సీఎం చంద్రబాబులు మాత్రం రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన లోకేష్ కూడా స్పందించారు.
సొంత వనరులతోనే ముందడుగు
రుణమాఫీకి రిజర్వు బ్యాంక్ నుంచి ఆశించిన మేర సాయం అందడం అనుమానాస్పదంగా మారడంతో సొంతంగా నిధుల సేకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికోసం ఇప్పటికే రూ.పదివేల కోట్లు సేకరించి దగ్గర ఉంచుకుందట. వాణిజ్య బ్యాంకుల నుంచి మరో పాతిక వేల కోట్ల రూపాయల మేర రుణాలు సేకరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీకి తమ సహకారం ఉండబోదన్న కోణంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
రిజర్వు బ్యాంక్ నుంచి గతంలో అందిన లేఖల్లో సారాంశాన్నే గవర్నర్ ఇప్పుడు బహిరంగంగా చెప్పారని, అది కొత్త విషయం కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాన్ని ముందు నుంచే ఊహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టి పని చేస్తోందట.
సమాచారం మేరకు.. రూ. పదివేల కోట్ల మేర నిధులను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోగు చేసుకుందట. కాంగ్రెస్ హయాంలో చివరి తొమ్మిది నెలల్లో మంజూరైన పనుల బిల్లులను ప్రభుత్వం నిలిపివేసింది. వాటిపై పరిశీలన జరుపుతోంది. దానివల్ల సుమారు ఐదారు వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం వద్ద మిగిలాయి. మద్యం దుకాణాల కేటాయింపు, వ్యాట్ ఆదాయం తదితర రూపాల్లో వచ్చిన ఆదాయం నుంచీ కొంత భాగం సేకరించి ప్రభుత్వం ఈ నిధిని తయారు చేసుకోగలిగింది. ఇసుక, ఎర్రచందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని జమచేసి రుణం తీసుకోవాలనుకుంటున్నారు.