విభజన తర్వాత సమర్థ నాయకత్వంలో దూసుకెళ్తున్నాం: గవర్నర్
రాష్ట్ర విభజన తర్వాత సమర్థ నాయకత్వంతో అభివృద్దిలో దూసుకెళ్తున్నామని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ చెప్పారు.
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత సమర్థ నాయకత్వంతో అభివృద్దిలో దూసుకెళ్తున్నామని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ చెప్పారు. గురువారం ఉదయం విజయవాడలో జరిగిన 68వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తోందని అన్నారు. 12.23శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు.
ఆర్థిక సమస్యులున్నా సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తోందిన అన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికీ అందేలా చూస్తోందని చెప్పారు. సంక్షేమ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సాంకేతికతతో రాష్ట్రంలో ముందుకెళ్తోందని అన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్రం ముందుందని తెలిపారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ట నదులు అనుసంధానం చేశామని అన్నారు. 2018జూన్ లోగా వంశధార ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.
గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకలను చూసేందుకు విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.