ఏపీలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారికి స్పెషల్ పాసులు జారీకి గ్రీన్ సిగ్నల్
కరోనా లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో కరోనా ప్రభావం తగ్గుతుందని భావించినా కరోనా కేసులు నమోదు ఇన్ని రోజులు గడిచినా ఆగటం లేదు . ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇలాగే ఉంటె అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన ఏపీ సర్కార్ లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తుంది.
ఇక ఇప్పుడు రెండు నెలలుగా ఒకే చోట ఉండిపోయిన ప్రజలు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారంతా బయటకు వస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వ్యక్తులు ఇంతకాలం తమకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగారు. ఇక వారు ఇప్పుడు తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్య చికిత్స, ప్రభుత్వ విధులు నిర్వర్తించటం , సామాజిక పనులు, కుటంబంలో మరణాలు వంటి వాటి విషయంలో ప్రయాణాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇక దీని కోసం చెయ్యాల్సిందల్లా దరఖాస్తు చేసుకోవటమే .. ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకుంటే వారికి స్పెషల్ పాసులు జారీ చేస్తుంది. ఈ స్పెషల్ ఈ పాసులను పోలీస్ శాఖ జారీ చేస్తుంది. దీని కోసం వారి పాస్ పోర్ట్ ఫోటో, ప్రయాణించే వారి వివరాలు, ఐడి కార్డు వివరాలు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాహనానికి సంబంధించిన వివరాలను ఈ పాస్ జారీ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అందించాలి. వివరాలు అందించిన వాళ్లకు ఓటీపీ వస్తుంది. అన్ని వివరాలు సరిగా ఉంటే ఈ పాస్ తో పాటు రూట్ పాస్ లభిస్తుంది. అలా తమ ప్రయాణాలు కొనసాగించవచ్చునని ప్రభుత్వం చెప్తుంది.