విజయవాడ, గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే
విజయవాడ నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదగా హైదరాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం ఐదున్నర గంటల సమయం పడుతోంది. ఖమ్మం, ఖాజీపేటమీదుగా అయితే ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం పడుతోంది. ఇకనుంచి గుంటూరు మీదగా హైదరాబాద్ ను మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. దీనికి పట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. శరవేగంగా రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం అసలు లేదు. ఇప్పుడున్న వేగంతో ప్రయాణిస్తే చాలు.
గతవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దీనివల్ల రైళ్ల సర్వీసులు పెరగడమే కాకుండా ప్రయాణించే సమయం కూడా బాగా తగ్గనుంది. సింగిల్ లైన్గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గంలో సిమెంటు కంపెనీల సరకు రవాణా విస్త్రతంగా జరుగుతుంటుంది. ఈ రద్దీకి తగినట్లుగా ప్రయాణికుల రైళ్లను మాత్రం దక్షిణమధ్య రైల్వేకు కష్టమవుతోంది. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా బాగా పెరగనుంది.

ఈ ప్రాజెక్టు ₹2,853 కోట్ల వ్యయం కానుంది. 2027-28 నాటికి 75 లక్షల పనిరోజులకు ఉపాధిని కల్పించనుంది. ప్రయాణ సమయం గంట తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక రేక్ రవాణా ఖర్చు కూడా రూ.5లక్షలకు తగ్గనుంది. సిమెంటు ఫ్యాక్టరీల నుంచి సరకు రవాణాను వేగంగా చేయడంవల్ల ధరలు కూడా తగ్గనున్నాయి.
ప్రస్తుతం ఈ మార్గంలో అత్యధిక వేగంతో లింగంపల్లి-విజయవాడ ఎంప్లాయిస్ ట్రైన్ (12795, 12796) నడుస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి 5.45 గంటలకు మంగళగిరి చేరుకుంటుంది. అక్కడినుంచి 6.15 గంటలకు గుంటూరు వస్తుంది. తర్వాత ఎక్కడా ఈ రైలుకు స్టాప్స్ లేవు. 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 313 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 4 గంటల 40 నిముషాల సమయం పడుతోంది. డబుల్ లైను అందుబాటులోకి వస్తే మూడు గంటలు లేదంటే 3 గంటల 20 నిముషాలు మాత్రమే పట్టనుంది.












Click it and Unblock the Notifications