guntur: రమ్య హత్యపై రాజకీయం -శాడిస్టిక్ ఆనందం -నారా లోకేశ్పై సాయిరెడ్డి -నిందితుడి సూసైడ్ అటెంప్ట్
దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం సంబురంలో మునిగిపోయిన వేళ ఆంధ్రప్రదేశ్ లో ఓ విద్యార్థిని దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని కాకాని రోడ్డులో ఉన్మాది చేతిలో బలైపోయిన బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్యోదంతం సంచలనంగా మారింది. ఈ హత్యను రాజకీయ కోణంలో చూడరాదని రాష్ట్ర డీజీపీ స్వయంగా ప్రకటన చేసినా పార్టీలు మాత్రం తమ పని తాము చేశాయి. రమ్య హత్య సాక్షిగా టీడీపీ, వైసీపీలు పరస్పరం మాటలదాడికి దిగాయి. వివరాలివి..

రేపు గుంటూరుకు లోకేశ్..
టీడీపీ చీఫ్ చంద్రబాబు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సోమవారం నాడు గుంటూరు పట్టణానికి రానున్నారు. సిటీలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. సోమవారం జరగనున్న రమ్య అంత్యక్రియల్లో లోకేశ్ పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రమ్యశ్రీ హత్యకు శాంతి భద్రతల వైఫల్యమే కారణమని టీడీపీ ఆరోపిస్తున్నది. హత్యోదంతంపై సమాచారం అందిన వెంటనే నారా లోకేశ్ బాధితురాలి కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారని, వారి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే..

ఎవరు పోయినా ప్రభుత్వ ఖాతాలోకా?
బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్యకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ప్రకటన చేయడం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేరుగా గుంటూరు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంటాననడంపై అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. శవాల కోసం లోకేశ్ యాత్ర మొదలుపెట్టారంటూ మండిపడ్డారు. ఎవరు, ఏ కారణంతో చనిపోయినా ప్రభుత్వ ఖాతాలో వేసి, ఇంకొందరు పోతే బాగుండు అనే శాడిస్టిక్ ఆనందంతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని సాయిరెడ్డి అన్నారు.

డబ్బు కోసం చస్తారని హేళన..
రమ్య హత్య కేసుతోపాటు గతంలో చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న గటనలనూ ప్రస్తావిస్తూ నారా లోకేశ్ పై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. ''శవాల కోసం మాలోకం యాత్ర మొదలు పెట్టాడు. ఏ కారణంతో చనిపోయినా ప్రభుత్వ ఖాతాలో వేసి, ఇంకొందరు పోతే బాగుండు అనే శాడిస్టిక్ ఆనందంతో చెలరేగిపోతున్నాడు. నీ తండ్రి మోసపు హామీలతో పోయిన ప్రాణాలెన్నో తెలుసుకో. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అమలు చేయనందుకు జరిగిన ఆత్మహత్యల లెక్కలు కావాలా? ఆత్మహత్యల గురించి నువ్వు మొరగడం వింతగా ఉంది లోకేశం. నీ తండ్రి ఉమ్మడి ఏపి సీఎంగా ఉండగా దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. లక్ష పరిహారం ఇవ్వమని ప్రతిపక్షనేత డా.వైఎస్సార్ కోరితే డబ్బు కోసం చస్తారని హేళన చేసిన చరిత్ర నీ తండ్రిది. బషీర్ బాగ్ కాల్పులు జరిపించిందెవరు?'' అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

నిందితుడి ఆత్మహత్యాయత్నం..
గుంటూరు హత్య కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రమ్య ఆదివారం ఉదయం కాకాని రోడ్డులో హత్యకు గురైంది. టిఫిన్ కోసం రోడ్డుపై వెళుతోన్న ఆమెను, అటుగా వచ్చి ఓ యువకుడు తన బైక్పై ఎక్కాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు దుండగుడు. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. రమ్య పొట్ట, గొంతు, పొత్తికడుపు భాగంలో మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పాత గుంటూరు పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన వెనకున్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను గమనించిన బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు.
Recommended Video

సోషల్ మీడియా పరిచయాలపై డీజీపీ వార్నింగ్
గుంటూరు విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందుతుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications