గుంటూరులో వైసీపీకి భారీ షాక్ ! కీలక నేత గుడ్ బై ...
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కుదేలైన వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలకమైన గుంటూరు జిల్లాలో ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో నిన్న మొన్నటివరకూ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం నగర పార్టీ బాధ్యతలు చూస్తున్న కీలక నేత ఇవాళ గుడ్ బై చెప్పేసారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత వైఎస్ జగన్ కు పంపిన లేఖలో స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అదను చూసి వైసీపీలోకి ఫిరాయించారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అదే సీటు ఆశించిన ఆయనకు పార్టీ అధిష్టానం షాకిచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి విడదల రజనికి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన గిరిధర్ ను ఆ తర్వాత గుంటూరు సిటీ వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు.
అయితే రాష్ట్రంలో పార్టీ మారడం, గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి, గుంటూరు నగర అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ జగన్ కు పంపిన లేఖలో మద్దాలి గిరి వెల్లడించారు. ఆయన త్వరలో తిరిగి టీడీపీ గూటికి చేరే అవకాశాలున్నాయి. కీలకమైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరికి వ్యాపార వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిరిని టీడీపీ చేర్చుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications