శ్రుతి మించిన జీవియల్ ఆరోపణలు..! చెలరేగిపోయిన తెలుగు తమ్ముళ్లు..!!
బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నర్సింహారావు ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు శ్రుతిమించుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజకీయం కోణం కాకుండా ఆర్ధిక శాఖ లోని లొసుగులను బహిర్గతం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 59వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెలుగుదేశం పార్టీ పాల్పడిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు ప్రభుత్వం పైన ఆర్థక నేరం మోపారు. జీవియల్ చేసిన ఆరోపణను ఆధారాలతో నిరూపించాలని తెలుగు తమ్ముళ్లు సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు జీవీయల్ అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేద్దామనుకున్న ఎంపీ గారికి తానే ఆత్మరక్షణలో పడే పరిస్థితి నెలకొంది.
రాజకీయ విమర్శలకు నైతికత ఉండదా..? ఆరోపణలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా..??
రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే గతంలో ఈ విమర్శలకు, అవినీతి ఆరోపణలకు ఓ నిబద్దత, ఓ నైతికత ఉండేవి. అవి నేటి రాజకీయాలలో కనుమరుగు కావడం శోచనీయం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆరోపణలు, ఈ విమర్శలు ఒక స్ధాయి దాటి చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావు చేసిన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలే దీనికి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతాధికారుల ఖాతాలలో ఏకంగా 59 వేల కోట్ల రూపాయల దాచిందన్న విచిత్ర ఆరోపణ చేశారు. ఇది ఆయన అవగాహనా లేమికి మచ్చుతునకగా నలుస్తుందనుకోవచ్చు.
ఆర్థిక అంశాల పట్ల అవగాహన లేకపోతే మొదటికే మోసం.. !
సాధారణంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా అధికారుల పేరిట ప్రభుత్వాలు కొన్ని వ్యక్తిగత ఖాతాలు తెరుస్తాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పద్దతి. వీటిని ఇంగ్లీషులో పీడీ అకౌంట్లు అంటారు. వీటిని అన్ని రాష్ట్రాలు అత్యవసర నిధుల ఖజానా పేర్కొంటాయి. ఏ రాష్ట్రంలోనైనా పెద్ద ప్రాజెక్టులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, లేదా ప్రజలకు సంబంధించిన అత్యవసర కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంకుల్లో అధికారుల పేరిట ఉన్న ఈ పీడీ ఖాతాల నుంచి నిధులను వినియోగిస్తారు. రాజ్యసభ సభ్యుడు అయిన జీవీఎల్ కు ఈ సంగతి పూర్తిగా తెలియక ఇలా ఆరోపించారని పలువురు అంటున్నారు. ఆయన విమర్శించినట్టు ఈ పీడీ ఖాతాలు తెలుగుదేశం కార్యకర్తల పేరు మీద ఉండవు. అధికారుల పేరు మీదే ఉంటాయి.
ఆరోపణ సరే..! మరి ఆధారాలు ఎక్కడ..?
రాష్ట్ర బడ్జెట్తో పాటు వివిధ మార్గాల ద్వారా వచ్చిన గ్రాంట్లు ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధులు కూడా అంతమవుతాయి. అలాంటి కీలక సమయంలో పీడీ ఖాతాల్లోని నిధులను ప్రభుత్వాలు వినియోగించడం సాధారణమే! భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ పీడీఖాతాల్లోని నిధులను వాడతారన్న విషయాన్ని జీవీఎల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్ధాన్, గుజరాత్ల్లోనే ఈ నిధులను వినియోగిస్తున్నారు. రాజస్థాన్లో ఏకంగా 34, 613 కోట్ల రూపాయల నిధులను పీడీ ఖాతాల నుంచి వినియోగించారు.
బ్లేమ్ గేమ్ తో జీవియల్ నవ్వుల పాలు..!
ఇక మహారాష్ట్రలో అయితే 21, 605 కోట్లు, తెలంగాణలో 10, 873 కోట్లు, గుజరాత్లో 395 కోట్లు, హర్యానాలో 235 కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోంచి వినియోగించారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26, 513 కోట్ల రూపాయలు పీడీ ఖాతాల నుంచి వినియోగించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కలను కాగ్ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వెల్లడిస్తుంది. అందుకే ఇలాంటి విషయాలపై జీవీఎల్ విమర్శలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడటం మంచిదని, లేదంటే నవ్వులపాలు కావడం తప్పదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.