సజ్జల మాటల్లో భయం; వైసీపీ పతనం ప్రారంభం: తోలుతీసే పార్టీ మాదేనన్న జీవీఎల్ నరసింహారావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని అందుకు బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడం నిదర్శనమని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన విజయవాడలో ప్రజాగ్రహ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి అంటే లెక్కలేనితనంగా ఉన్న పార్టీలకు నిన్నటి ప్రజా ఆగ్రహ సభ ఒక మేలుకొలుపు లాంటిదని, వైసీపీ పతనం ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు.
షాకింగ్: 2021 క్రైమ్ రిపోర్ట్ ..ఏపీలో మహిళలపై 21.5శాతం పెరిగిన నేరాలు; వారంలో 75 రేప్ కేసులు
సజ్జల మాటల్లో భయం కనిపిస్తుంది
బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్న ఆయన, సజ్జల మాటల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ ఆయా పార్టీలకు ఓరకంగా భయం కలిగిందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్వహించిన సభతో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
అవినీతి తోలు తీసే పార్టీ ఒక్క బీజేపీనే
సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ పరిస్థితి గల్లంతని అర్థం చేసుకోండి అంటూ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్థితి బీజేపీకి లేదని సజ్జల వ్యాఖ్యలపై చురకలంటించారు. అవినీతి తోలు తీసే పార్టీ ఒక్క బీజేపీ నేనని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బురదజల్లే కార్యక్రమాన్ని విరమించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
బీజేపీ ఫోకస్ పెడితే వైసీపీ నేతల అడ్రెస్ గల్లంతు .. అందుకే జాలి డ్రామాలు
ఏపీపై బీజేపీ ఫోకస్ పెడితే వైసీపీ నేతల అడ్రస్ లు గల్లంతు అవుతాయి అని తెలిసే జాలి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పాలన సుపరిపాలనకు అద్దం పడితే, జగన్ పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ స్వార్థం దాగి ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారి పోయారని తేల్చి చెప్పారు. బిజెపి మీ ఆటలను, కుట్రలను కట్టిస్తుందంటూ పేర్కొన్నారు. మేము తగ్గేది లేదంటూ స్పష్టం చేసిన జీవీఎల్ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ బీజేపీని టార్గెట్ చేసిన సజ్జల కామెంట్స్ ఇవే
ఇదిలా ఉంటే టిడిపి అనుబంధ విభాగం మాదిరిగా బీజేపీ సభ జరిగిందని వైయస్సార్ సిపి ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బిజెపి ని టార్గెట్ చేశారు. చంద్రబాబు అజెండా ప్రకారమే రాష్ట్రంలో బీజేపీ నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి కానీ ఏపీలో మాత్రం రివర్స్ లో పనిచేస్తుందని, ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పనిచేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ బిజెపిని చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.