నాయుళ్ల కుట్ర: హరీష్, కేసీఆర్ అప్పుడేం చేశారు: కిషన్
మెదక్: హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల కుట్ర ఉన్నదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఆరోపించారు.
మెదక్ జిల్లా సంగారెడ్డిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదన్నారు. గతంలో తాము లేఖలు రాసినా పట్టించుకోకుండా ఉత్తర్వులు పంపించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనన్నారు. చంద్రబాబు, వెంకయ్యల ప్రోద్బలంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు.
గుజరాత్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర అధికారాలపై అప్పట్లో యూపీఏ ప్రభుత్వంతో గొడవపడిన విషయం మరిచిపోయారన్నారు. హైదరాబాద్పై గవర్నర్ పెత్తనం ఎందుకు ఉండాలి? ఎవరినైనా వెళ్లిపొమ్మన్నామా? ఎవరిపైనయినా కేసులు పెట్టామా? అని అడిగారు. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినపుడు గవర్నర్లకు ఇలాగే అధికారాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తమ వైఖరేంటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఆయనకు, ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. లేకపోతే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. హైదరాబాద్లో ఏమైనా అల్లర్లు జరిగితే కేంద్రం బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని, వారికి లేని ఇబ్బంది సీమాంధ్రులకు ఎందుకన్నారు.
హైదరాబాద్పై గవర్నర్కు అధికారాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబుది పక్కింటివారు చెడిపోవాలనే మనస్తత్వమని, ఏపీని అభివృద్ధి చేయలేక తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టీ-టీడీపీ నేతలు అలాంటి చంద్రబాబు వెనుక ఉంటారా, పార్టీని వీడి వస్తారా తేల్చుకోవాలన్నారు.
నాడేం చేశారు: కిషన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాదు పరిధిలో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు అప్పగించే అంశంలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అది యూపీఏ చేసిందేనన్నారు. నాడు సోనియా గాంధీ ప్రత్యేక అధికారాలు గవర్నర్కు ఇస్తుంటే కేసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.