రాజధాని తప్ప ఏంలేదా: హర్ష, రాజధానిపై వెంకయ్య
విజయవాడ: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వంలా లేదని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలా తయారయిందని మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ ఆదివారం నాడు మండిపడ్డారు. ఎంతసేపూ రాజధాని గురించి తప్ప ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టవా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ నిధుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
జూపూడి వల్ల చాలామంది ఓట్లేశారు: వైసీపీ ఎమ్మెల్యే
జూపూడి ప్రభాకర్ ప్రసంగాలకు ఆకర్షితులై చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వేరుగా అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూపూడి లాంటి నేతను వదులుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన వల్లే పార్టీకి చాలా ఓట్లు వచ్చాయన్నారు. మాలల అభివృద్ధి కోసం ఆయన వెంట నడుస్తామన్నారు.
ప్రత్యేక హోదా కోసం సీఎం దిష్టిబొమ్మ దగ్ధం, ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చెబుతూ తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సీపీఐ ప్రయత్నించింది. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.
జేపీ రౌండ్ టేబుల్ సమావేశం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం కోసం హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంతో అధికారికంగా వెల్లడించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడితే పరిశ్రమలకు పన్నుల రాయితీలు సాధించవచ్చన్నారు. వచ్చే అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేయాలన్నారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు.
అంతర్జాతీయ రాజధాని: వెంకయ్య
ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లూరుతో పాటు చుట్టుపక్కల నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ రాజధాని ఏర్పాటవుతుందని, ఈ మేరకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గుంటూరులో మాట్లాడారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారు ఒక్కటేనని, అన్నదమ్ములన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నిస్తామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో మంచినీరు, మురుగునీటి పారుదల నిమిత్తం రూ.వెయ్యికోట్లు కేటాయించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications