రూ.10బోర్డు పెట్టి రూ.100 వసూలు: తిరుమలలో దోపిడీపై హైకోర్టు ఆగ్రహం
తిరుమలలో వ్యాపారులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారని మంగళవారం ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కుమ్మక్కవడంతో వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న
తిరుపతి: తిరుమలలో వ్యాపారులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారని మంగళవారం ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కుమ్మక్కవడంతో వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడింది.
బయట రూ.10 బోర్డు పెట్టి రూ.100 వసూలు చేస్తున్నారని, బిల్లులు జారీ చేయకపోవడంతో పన్నులు కూడా చెల్లించడంలేదని వ్యాఖ్యానించింది. మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈఓ) సింఘాల్ను ఆదేశించింది.
అధిక ధరలు వసూలు చేస్తున్నా..
అంతేగాక, తిరుమలలో తినుబండారాల(ఫుడ్ ఐటమ్స్)ను అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, ఫిర్యాదులు ఇచ్చినా స్పందించట్లేదని పేర్కొంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి గత సంవత్సరం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈవో సింఘాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
ఏం చర్యలు తీసుకున్నారు..?
అధిక ధరలు వసూలు చేస్తున్న వ్యాపారులపై చర్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో కూడిన కౌంటర్ను టీటీడీ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ ధర్మాసనానికి అందజేశారు. కౌంటరు దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని, ఈవోగా సింఘాల్... మే నెలలో బాధ్యతలు స్వీకరించారనని, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాకపోవడంతో జాప్యం జరిగిందని వివరించారు. బాధ్యతలు చేపట్టిన తరువాత ఏం చేశారని, సమాచారమివ్వని అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇంత నిర్లక్ష్యం ఎందుకు?
కోర్టు ఉత్తర్వుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని, చాలావరకు కేసుల్లో అధికారులను పిలిపించి వారి నుంచి వివరాలు తెలుసుకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారులకు నోటీసులు, జరిమానాలతో సమస్య పరిష్కారం కాదని, వ్యాపారికి గిట్టుబాటు ధరను గుర్తించి టీటీడీనే ఎందుకు నిర్ణయించరాదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అధిక ధరలు వసూలు చేస్తూ బిల్లులు ఇవ్వకపోయినా అధికారులు స్పందించడంలేదని, స్వానుభవంలోనూ ఎదురైందని పేర్కొంది.
కోర్టు చెబితేనే చేస్తారా?
ఇటీవల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామని, నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి రూ.21 లక్షల దాకా జరిమానా వేశామని న్యాయవాది నివేదించగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ హైకోర్టు చెబుతోందంటూ జరిమానా విధించారా? లేదంటే నిబంధనలు ఉల్లంఘించారని విధించారా? అంటూ ప్రశ్నించింది. జరిమానాకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నవంబరు 14వ తేదీకి వాయిదా వేసింది. ఇలాంటి వ్యవహారాల్లో నిర్లక్ష్యం సరికాదని స్పష్టం చేసింది.