ప్రజా వేదికకో న్యాయం-సచివాలయాలకో న్యాయమా ? హైకోర్టు సంచలన వ్యాఖ్యలు !
ఏపీలో 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. జగన్ సర్కార్ టీడీపీపై కక్షసాధింపు కోసమే ప్రజా ధనం వెచ్చించి కట్టిన ప్రజావేదికను కూల్చేసిందని విపక్షాలు విమర్శించాయి. అయితే ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. హైకోర్టుకు వెళ్లినా దీనిపై అప్పట్లో టీడీపీకి ఊరట దక్కలేదు. కానీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు హైకోర్టు మరోసారి ఇదే వ్యవహారాన్ని మరో కేసులో ప్రస్తావించింది.
ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం
ఏపీలో 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే కృష్ణానది ఒడ్డున గత టీడీపీ సర్కార్ నిర్మించిన అక్రమ కట్టడంగా దీన్ని గుర్తించి కూల్చేసింది. దీనిపై అప్పట్లో విపక్ష నేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అక్రమ కట్టడంగా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి కూల్చివేత సమంజసమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు హైకోర్టు మరోసారి ఇవాళ మరో కేసులో ఇదే వ్యవహారాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలోని స్కూళ్లలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
స్కూళ్లలో ఆర్బీకే, సచివాలయ భవనాలు
ఏపీలోని పలు జిల్లాల్లో ఉన్న స్కూళ్లలో వైసీపీ సర్కార్ గత కొంతకాలంగా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మిస్తోంది. దీని వల్ల సదరు స్కూళ్లలో ఉన్న స్ధలాలు మరింత కుచించుకుపోతున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుపుతున్న హైకోర్టు గతంలో స్కూళ్లలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల్ని అక్రమ కట్టడాలుగా పరిగణిస్తామని తెలిపింది. తక్షణం వీటిని నిలిపేయాలని ఆదేశించింది. అయినా పలు చోట్ల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరిగిపోయింది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
స్కూళ్లకే తిరిగిస్తామన్న ప్రభుత్వం
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో స్కూళ్లలో ఇప్పటికే నిర్మించిన ఆర్బీకే భవనాలు, సచివాలయ భవనాల్ని తిరిగి స్కూళ్లకే అప్పగిస్తామని వెల్లడించింది. తద్వారా జరిగిన తప్పుకు పరిహారం చేసుకుంటున్నట్లుగా తెలిపింది. కానీ హైకోర్టు మాత్రం దీనికి అంగీకరించలేదు. గతంలో సదరు నిర్మాణాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాల్ని గుర్తుచేసింది. నిర్మాణాలు నిలపాలని చెప్పినా కొనసాగించడం అక్రమమే కదా అని ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రజా వేదికతో పోల్చిన హైకోర్టు ?
గతంలో అక్రమ కట్టడమన్న పేరుతో ప్రజావేదికని కూల్చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు స్కూళ్లలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాల్ని కూడా కూల్చేయాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అలా కాకుండా స్కూళ్లకే వాటిని ఇచ్చేస్తామంటూ ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా వేదికకో న్యాయం రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలకో న్యాయమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దీంతో తదుపరి విచారణలో ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.