ఆశల పల్లకిలో ప్రజలు: మంగళగిరికి ఆ అవకాశం దక్కుతుందా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరికి భారీ సరకుల రవాణా కేంద్రం దక్కనుందా? అంటే అవుననే అంటున్నారు పట్టణ ప్రజలు. వివరాల్లోకి వెళితే... సీఆర్డీఏ పరిధిలో భారీ సరుకు రవాణ కేంద్రాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలకు మధ్యలో ఉన్న మంగళగిరిపై ఆశలు పెరుగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాలను లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చేయాలని సింగపూర్ సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు పట్టణ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ సరుకు రవాణా కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్సీ సిన్హా ఛైర్మన్గా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ పీడబ్ల్యూడీ మాజీ కార్యదర్శి జందర్, సీడీకో అండ్ఎంఏడీసీ కమ్యూనికేషన్ హెడ్ ఆర్కే జాలను సభ్యులుగా నియమించింది.
దేశంలోని ఇతర సరుకు రవాణ కేంద్రాలను పరిశీలించి ఒక మోడల్ లాజిస్టిక్ కేంద్రం నిర్మాణానికి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడవును ఇచ్చింది. ఇప్పటికే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పరిశ్రమలు నిర్మాణం కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో సరుకు రవాణ కేంద్రాన్ని సీఆర్డీఏ బయట కాకుండా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం రాజధాని ప్రాంత ప్రజల నుంచి వ్యకమవుతోంది. ఇందుకోసం మంగళగిరి అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా చెబుతున్నారు.
మంగళగిరికి రైలు కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉండటం విశేషమని, ఇక్కడికి పదికిలోమీటర్ల దూరంలోనే దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే విజయవాడ రైల్వే జంక్షన్ ఉందంటున్నారు. గన్నవరం విమానాశ్రయం మంగళగిరికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం.