ఆస్తిని లాగేసుకున్నారు...బతికుండగానే స్మశానంలో వదిలేశారు....వృద్దురాలి పట్ల బంధువుల దుర్మార్గం...
చిత్తూరు: అయినవాళ్ల మన్నారు...మెల్లిగా పంచన చేరారు...ఆ తరువాత మొత్తం ఆస్తి లాగేశారు...ఇక ఆమె ఎందుకు మనకు భారమనుకున్నారు...బతికుండగానే తీసుకెళ్లి ఏకంగా స్మశానంలో వదిలేసి వచ్చారు. ఇప్పుడు స్మశానంలోనే ఆమె జీవనం...పొద్దు గూకితే శ్మశానం వైపు వెళ్లేందుకే ఎవరూ సాహసించరు. అలాంటిది ఆ మహిళకు అదే కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇలాంటి మనుషుల కన్నా ఆ ప్రేతాత్మలే ఎంతో నయమనుకుందో ఏమో కాలం అంతా అక్కడే వెళ్లబుచ్చుతోంది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్నఈ దారుణంపై స్థానికులే మీడియాకు సమాచారం ఇవ్వడం గమనార్హం.
చిత్తూరు జిల్లా పిటిఎం మండలం కొండువారి పల్లెకు చెందిన సిద్దమ్మ, పాతకందుకూరుకి చెందిన హనుమన్నతో వివాహమైంది. పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలే ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తూ వచ్చారు. ఒకప్పుడు మోతుబరులైన వీరు వేరే జీవనాధారం లేక ఉన్న 10 ఎకరాల పొలాన్ని కొంచెంకొంచెంగా అమ్ముకుంటూ వచ్చారు. ఈ క్రమంలో కొద్ది భూమే మిగిలింది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల క్రితం హనుమన్నను మృత్యువు కబళించింది.
దీంతో ఏకాకైన సిద్దమ్మ మిగిలిన పొలం కూడా అమ్మేసి ఆ సొమ్మును చేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తూ వచ్చింది. దీనికి తోడు సిద్దమ్మకు వయస్సు పైబడటంతో వినికిడి లోపం వచ్చింది. అదే మండలం పాతకందుకూరుగ్రామంలో నివాసం ఉంటున్న సిద్దమ్మకు వరుసకు మనవడయ్యే లక్ష్మయ్య ఆమె తమకు అమ్మమ్మ అవుతుందని, ఆమెని తీసుకువెళ్లి బాగా చూసుకుంటామని గ్రామస్థులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు.

అయితే అతడు,అతడి భార్య వ్యవహార శైలి గమనించి అనుమానించిన గ్రామస్థులు ముందే తిరస్కరించారు. దీంతో లక్ష్మయ్య పోలీసులను ఆశ్రయించి, పంచాయితీలు పెట్టి మూడేళ్ల క్రితం సిద్దమ్మను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆ తరువాత ఇంకేముంది...షరా మామూలుగానే ఆమె వద్ద ఉన్న సొమ్మును మెల్ల మెల్లగా వాడేసుకున్నారు. ఆలనాపాలనా కూడా సరిగ్గా చూడకపోవడంతో సిద్దమ్మ నడవలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నలక్ష్మయ్య తనలోని అమానుషత్వాన్నిచాటుకుంటూ నెలన్నర క్రితం ఆమెని పాతకందుకూరులోని శ్మశానంలో వదిలివెళ్లాడు. స్మశానంలో చిన్న డేరాలాంటిది కట్టి నువ్వు ఇక్కడే సుఖంగా ఉండొచ్చని చెప్పి మాయమయ్యాడు.
సిద్దమ్మ నడవలేని స్థితిలో స్మశానంలో ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. ఒకప్పుడు బాగా బతికిన ఆమె అని ఎవరైనా జాలితో తమ వంతు సాయం చేద్దామని వెళ్లినా లక్ష్మయ్య భార్య వారిపై విరుచుకుపడేది. ఆమెను ఎలా చూసుకోవాలో తమకు తెలుసని మీరేం పట్టించుకోనక్కర్లేదని గొడవకు దిగేది. అందువల్ల అప్పటిదాకా కొంతమంది స్థానిక మహిళలు అప్పుడప్పుడు ఆమె వద్దకు వెళ్లి తలదువ్వి, బట్టలు మార్చేవారు కూడా ఆ తరువాత మానుకున్నారు.
దీంతో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో కొంతమంది గ్రామస్థులు ఆమె దీనగాధను తెలియజేస్తూ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆమె ఎప్పుడు తింటుందోనని అసలు తింటుందో లేదోనని, స్నానం చేసి ఎంతకాలమైందో కూడా తెలియని పరిస్థితిలో అక్షరాలా బలవంతంగా కాటికి కాళ్లు చాపుకొని చావు కోసం నిరీక్షిస్తోందని వారు తెలిపారు. ఏదేమైనా గొప్పబతుకు బతికి చివరకు ఇలా విధి విక్రీకరించడం వల్ల అయినవారే మోసం చేయడంతో సజీవంగానే సమాధుల మధ్య కాలం వెళ్లదీయాల్సి వచ్చిన సిద్దమ్మ జీవితం అందరిలోను అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.












Click it and Unblock the Notifications