తప్పు చేసింది, కిరణ్ మార్పు ఈజీ కాదు: టిజి వెంకటేష్
హైదరాబాద్: ముఖ్యమంత్రిని మార్చడం అంత సులువైన విషయం కాదని, ఇప్పటికే ఒక తప్పు చేసిన తమ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి మరో తప్పు చేస్తుందని తాము అనుకోవడం లేదని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు.
మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమయంలో వారు మాట్లాడారు. ఇప్పటికే అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకొని ఓ తప్పు చేసిందన్నారు. మరో తప్పు చేయదని తాను అనుకుంటున్నానని చెప్పారు. అయినా ముఖ్యమంత్రిని మార్చడం అంత సులువైన విషయం కాదన్నారు. ఊహాగానాల పైన స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ముఖ్యమంత్రి మార్పు తేలికైన విషయం కాదని ఏరాసు అన్నారు. ఆయనను మారుస్తూ ఎమ్మెల్యేల ఏకవ్యాఖ్య తీర్మానం ఉండదన్నారు. కిరణ్ రెడ్డిని మార్చుతామంటే అధిష్టానం నిర్ణయానికి ఎమ్మెల్యేలు ఓకే చెప్పారన్నారు.
రాయలసీమలో కొత్త రాజధాని: బైరెడ్డి
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు చాలని, లక్ష ఎకరాలు అవసరం లేదని ఆయన అన్నారు. నదీ జలాల పంపిణీలో సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియలో కిరణ్, చంద్రబాబు, జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications