అవసరమైతే అధికారుల్ని జైలుకి పంపిస్తాం: అగ్రిగోల్డ్పై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్: అగ్రిగోల్డ్ విచారణ విషయమై ఏపీ సీఐడీ పైన ప్రభుత్వం శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడింది. అగ్రిగోల్డ్ వాటాదారుల డబ్బులను యాజమాన్యం కాజేసిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంతానికి వాడుకున్నారని వ్యాఖ్యానించింది.
శుక్రవారం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాల గురించి సీఐడీని అడిగింది. అగ్రిగోల్డ్కు చెందిన 22 ఖాతాల్లో రూ.6లక్షల నగదు ఉన్నట్లు హైకోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు.
అవసరమైతే దర్యాఫ్తు అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను అరెస్టు చేయాలని గతంలోనే చెప్పిన అవసరం లేదని కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడింది. అప్పుడే అరెస్టు చేస్తే దారిమళ్లిన రూ.10వేల కోట్ల వివరాలు తెలిసేవని పేర్కొంది. సిఐడి తీరు చూస్తుంటే నిందితులకు సహకరిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందని పేర్కోంది.
Also Read: సందేహాలు: 'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్ఫోన్ కుంభకోణమా?
రూ.10వేల కోట్లకు పైగా డిపాజిట్లలో 6లక్షలు మాత్రమే ఉండటమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విచారణ సమయంలో అగ్రిగోల్డ్ ఖాతాలు ఎందుకు స్తంభింపచేయలేదని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లుగా ఖాతాల నుంచి సొమ్ము డ్రా చేసినట్లు, వేరే ఖాతాలకు మళ్లించినట్లు తెలుసుకోలేదా అని ప్రశ్నించింది.
సీఐడీ తరఫు న్యాయవాదులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేవలం అరెస్టులతో బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందా అని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్కు చెందిన 22 అకౌంట్లలో రూ.ఆరు లక్షలే ఉండటాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది.
గడచిన రెండేళ్లలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా తరలించేసిందని అభిప్రాయపడ్డారు. నిబంధనలను తోసిరాజని నిధులను పక్కదారి పట్టిస్తున్న అగ్రిగోల్డ్ నయా మోసాన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన ఏడాది తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తే లాభం ఏమిటని ప్రశ్నించింది.
కాగా, కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో సీబీఐకి కేసును అప్పగించాలని ఏపీ సిఐడికి హైకోర్టు కొద్ది రోజుల క్రితం సూచించింది. తాజాగా శుక్రవారం నాడు విచారణలో భాగంగా ధర్మాసనం మరింత ఘాటుగా స్పందించింది.