మహా సంప్రోక్షణ టివిలో ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏమిటి?:టిటిడిని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్:తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే మహా సంప్రోక్షణను టివి ఛానెళ్లలో ప్రసారం చేసేందుకు నిరాకరించిన టిటిడి పై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది.
ఆగస్టు 9 నుండి 17 వరకు జరిగే మహా సంప్రోక్షణను అన్ని ఛానెళ్లలో ప్రసారం చేయాలని కోరుతూ ఒక భక్తుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఇప్పటికే ఒకసారి విచారణ జరుగగా శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా మహా సంప్రోక్షణ ను టీటీడీ ఛానల్ లో అయినా ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు టీటీడీని ప్రశ్నించింది.

మహా సంప్రోక్షణ ను టివిలో ప్రసారం చేసే విషయమై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై...గత విచారణ సందర్భంగా ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ ఎలాంటి టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేయడానికి వీల్లేదని టీటీడీ వాదించింది. అంతేకాదు మహా సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో సీసీటీవీలను కూడా నిలిపేస్తామని టీటీడీ కోర్టుకు తెలిపింది.
అయితే గర్భ గుడిలో కాకుండా బయట కెమెరాలను ఎందుకు వద్దంటున్నారో తెలపాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పిటీషనర్ కోరారు. మహా సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో కనీసం టీటీడీ ఛానెల్ లోనైనా ప్రసారం చేయాలని పిటిషనర్ కోరారు. మహా సంప్రోక్షణ తేదీలను ఇష్టానుసారంగా మారుస్తూ ప్రజల సెంటిమెంట్ను టీటీడీ దెబ్బతీస్తోందని ఆరోపించారు. అసలు మహా సంప్రోక్షణ విధివిధానాలు సరిగా లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.
దీంతో ఈ విషయమై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన హైకోర్టు కనీసం టీటీడీ ఛానల్ లో అయినా ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు టీటీడీని ప్రశ్నించింది. ఆ అభ్యంతరాలు ఏమిటో తెలపాలని టీటీడీని హైకోర్టు ఆదేశిస్తూ...తదుపరి విచారణను ఈ నెల13కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications