షర్మిల భర్త బ్రదర్ అనిల్కు షాక్: హైకోర్టు నోటీసు

2009 ఎన్నికల సమయంలో పాస్టర్ల సభ పేరిట హెలికాప్టర్లో డబ్బు తరలించారని అనిల్పై కేసు నమోదైంది. అప్పడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ ఉండగానే పోలీసులు అనిల్ పేరును కేసు నుంచి తొలగించేందుకు వ్యవహారం నడిచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది.
కేసు వివరాల్లోకి వెళితే... 2009 మార్చి 29న అనిల్ కరీంనగర్ సమీపంలోని లయోలా కళాశాలలో పాస్టర్లతో మత సంబంధిత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హెలికాప్టర్లో చేరుకున్న అనిల్ లయోలా కళాశాలలో ప్రార్థనలు ముగియగానే పాస్టర్లు కరీంనగర్లోని రత్నా లాడ్జికి పెద్ద గిఫ్ట్ ప్యాకెట్లతో సహా చేరుకున్నారు.
ఇది గమనించిన బీజేపీ నేతలు బండి సంజయ్, మహేందర్రెడ్డి, సాగర్, సందీప్ అనుమానం వచ్చి లాడ్జిలోని పాస్టర్ల గదుల్లోకి ప్రవేశించారు. రూ.10 లక్షల వరకు నగదు తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వారు గుర్తించారు. బ్రదర్ అనిల్ ప్రభుత్వ హెలిప్యాడ్ వాడుకోవడం, ఎన్నికల ప్రచారానికి మతాన్ని ఉపయోగించుకోవడం, డబ్బులు, కరపత్రాలు తరలించడం.. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమంటూ భారతీయ జనతా పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో డీజీపీగా ఉన్న ఏకె మహంతి పోలీసుల నిర్లిప్తతపై ఆగ్రహం వ్యక్తం చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో దీనిపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో దయానంద్ ఫిర్యాదు చేయడంతో బ్రదర్ అనిల్, మరో ఐదుగురిపై కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. అదే సమయంలో అనిల్ను కేసు నుంచి తప్పించాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.
మొత్తానికి ఈ కేసుతో అనిల్కు ఎలాంటి సంబంధం లేదని క్లీన్చిట్ ఇచ్చేశారు. ఏ1గా ఉన్న అనిల్ను కేసు నుంచి తప్పిస్తూ మరో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా తాము అప్పగించిన నగదు, వాహనాన్ని కోర్టుకు స్వాధీనపరచకుండా తిరిగి ఎలా ఇచ్చారో చెప్పాలంటూ జిల్లా బిజెపి నేత సంజయ్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఐపీఎస్ అధికారి చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications