వైసీపీ సర్కార్ కు హైకోర్టు షాక్: హైకోర్టు తరలింపు విషయంలో కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సీఎం జగన్ నిర్ణయానికి హైకోర్టు మోకాలడ్డింది . రాజధానిలో ఉన్న కార్యాలయాల తరలింపుపై విచారణ జరిపిన కోర్టు హైకోర్టు తరలింపు విషయంలో కీలక ఆదేశాలు ఇవ్వటం వైసీపీ సర్కార్ కు షాక్ అనే చెప్పాలి . ఇంతకీ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి ? అంటే
హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్
శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు రాజధాని ప్రాంత రైతులు . ఇక రాజధాని విషయంలో వేసిన కమిటీలకు చట్ట బద్ధత లేదని కోర్టును ఆశ్రయించారు రైతులు .ఇక హైకోర్టు తరలింపు పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఇక నేడు కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది ఏపీ సర్కార్ . వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డింది .
అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ ఆదేశాలు
రాజధాని కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది . హైకోర్టు తరలింపు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, సీఆర్డీఏలలో నిర్మాణాల అభివృద్ధి, రాజధానిలో భూముల కేటాయింపుపై జారీ చేసిన 107 జీవోను సవాలు చేస్తూ వేసిన అన్ని పిటిషన్లపై విచారించిన కోర్టు అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు మార్చాలని భావించిన జగన్ నిర్ణయానికి బ్రేక్ పడినట్టే అన్న భావన వ్యక్తం అవుతుంది.
గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పును ఉటంకించిన పిటీషనర్ తరపు న్యాయవాది
హైకోర్టు కు సంబంధించిన కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది స్థలం లేకనే కార్యాలయాల తరలింపు చేస్తున్నామని చెప్పారు.ఇక పిటీషనర్ తరపు న్యాయవాది ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న హైదరాబాద్ అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలి కి షిఫ్టింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2015లో తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.
హైకోర్టు ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వానికి షాక్
హైకోర్టుని షిఫ్ట్ చెయ్యాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లో సీనియర్ న్యాయవాది అంబటి సుధాకర్ వాదనలు వినిపించారు. దాంతో విచారణ కొనసాగించాలని నిర్ణయించిన హైకోర్టు ధర్మాసనం అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు గురించి దాఖలైన పిటిషన్లను ఒక బ్యాచ్గా, రాజధాని విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను మరో బ్యాచ్గా వాదనలు వినాలని త్రిసభ్య ధర్మసనం నిర్ణయించింది. మొత్తానికి వైసీపీ సర్కార్ తాజా హైకోర్టు నిర్ణయం షాక్ అనే చెప్పాలి .