గంటాకు రిలీఫ్ ... కూల్చివేత నోటీసులను సస్పెండ్ చేసిన హై కోర్టు
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు ఆఫీస్ గా ఉన్న భీమిలిలోని గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ భవన యజమాని కంచర్ల రవీంద్రనాథ్, గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత అత్యవసర పిటీషన్ వేసి హై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గంటాకు ఊరటనిచ్చింది.
జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన నోటీసును హై కోర్టులో సవాల్ చేసిన గంటా కుమార్తె .. సస్పెండ్ చేసిన హై కోర్టు
గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నారు అధికారులు. జీవీఎంసీ ప్లానింగ్ విభాగం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లోగా గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. నిన్న గంటా గెస్ట్ హౌస్ వద్దకు జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు భారీగా మోహరించారు. భవనాల కూల్చివేత సమయంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భవన సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో పెట్టాలని కూడా అధికారులు భావించారు. అయితే కూల్చివేత కు సంబంధించి జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఈ నెల 27 వరకూ నోటీసు సస్పెండ్... వివరణ ఇవ్వాలని జీవీఎంసి అధికారులకు నోటీసులు
బీపీఎస్ కింద ఈ భవనాన్ని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసిన అధికారులు ఆమోదించలేదని ఇంతకు ముందు రవీంద్రనాథ్ కోర్టులో కేసు వేశారు. ఆగస్టు 13న దీనిపై తీర్పునిచ్చిన కోర్టు భవన యజమానికి వారం రోజులు గడువు ఇవ్వాలని నిబంధనలు పాటించారా లేదా అన్నది పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం గడువు ఉన్నా తమ భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు వచ్చారని జీవీఎంసీ కమిషనర్ ఈ నెల 22వ తేదీన ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్, గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత హై కోర్టులో హౌస్మోషన్ (అత్యవసర) పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సూచనలు పట్టించుకోకుండా జీవీఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారంటూ పిటిషనర్లు అత్యవసరంగా వేసిన పిటీషన్ ను అ జస్టిస్ జి.శ్యాంప్రసాద్ శుక్రవారం తెల్లవారుజామున విచారణ జరిపారు. జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన నోటీసులను ఈ నెల 27 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అధికారులు వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.దీంతో గంటాకు కాసింత ఊరట లభించింది.
టీడీపీ నేతల భవనాలు కూల్చివేస్తున్నా మౌనం దాల్చిన చంద్రబాబు .. నేతల్లో అసహనం
అయితే ఇదంతా కక్ష సాధింపు చర్యనే అని టీడీపీ నాయకులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. టీడీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ కూల్చివేతలు కొనసాగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఇప్పటి వరకు టీడీపీ ముఖ్య నేతలకు సంబంధించిన భవనాల కూల్చివేతలపై ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులైన మురళీ మోహన్, పీలా గోవింద్ వంటి నేతల భవనాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు గంటాను టార్గెట్ చేసి కూల్చివేతలకు సిద్ధం అయ్యారు. అయినా చంద్రబాబు మాట కూడా మాట్లాడకపోవటం టీడీపీ నేతలలో అసంతృప్తికి కారణం అవుతుంది.