నాకు బాంబులు వేయడం తెలుసు..ప్రాణాలు తీస్తా: జర్నలిస్టుపై బాలయ్య విసుర్లు
హిందూపూర్: ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. తొడ కొడితే సుమోలు గాల్లోకి లేస్తాయి... ఈల వేస్తే వచ్చే రైలు ఆగిపోతుంది. ఇదంతా రీల్ లైఫ్లో ... అదే రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది అనుకుంటున్నారు ఈ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్. ఎవరిని పడితే వారిని బహిరంగంగానే బూతులు తిట్టేస్తున్నాడు. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ పాటికి ఆయనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. యస్... హీఈజ్ నన్ అదర్ దెన్ బాలకృష్ణ.
మరోసారి నోరు జారిన బాలయ్య
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు జారడం ఇంకా మానుకోలేదు. ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపై చేయిచేసుకోవడం వారి పట్ల దురుసుగా వ్యవహరించడం చూశాము. ఈ సారి బాలకృష్ణ బూతులకు బలైంది మరెవరో కాదు ... ఓ న్యూస్ ఛానెల్కు చెందిన విలేఖరిపై బాలయ్య నోరు చేసుకున్నారు.
చిన్నపిల్లలపై బాలయ్య చిందులు
ఎన్నికల ప్రచారంలో ఉన్న బాలయ్య మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గమధ్యలో ఓ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ తమ అభిమాన నటుడిని , వారి ఎమ్మెల్యే బాలయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు గుమికూడారు. ముందుగా వారిని చూసి కసురుకున్నారు . వారిపై రంకెలేశారు. ఇక ఈ తతంగాన్ని తన కెమెరాలో బంధిస్తున్న విలేఖరిపై బాలయ్య కన్నుపడింది. అంతే ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.
కాంగ్రెస్ ఖాళీ అవుతోందా..? టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
నాకు బాంబులు విసరడం తెలుసు
విలేఖరి బాలయ్య తతంగాన్ని చిత్రీకరిస్తుండగా... అది చూసిన కథానాయకుడు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏమనుకుంటున్నావ్రా అంటూ తిట్ల పురాణానికి తెరదీశారు. మా బతుకులను మీచేతుల్లో ఉన్నాయారా..? అంటూ ధ్వజమెత్తారు. నాకు బాంబులు విసరడం తెలుసు.. కత్తి తిప్పడం కూడా తెలుసు..ప్రాణాలు తీస్తా అంటూ సదరు విలేఖరికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ముందు తాను చిత్రీకరించిన వీడియోను డిలీట్ చేయాలంటూ గదమాయించాడు బాలయ్య.
బాలయ్య మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది: స్థానికులు
ఇక విషయం బయటకు పొక్కడం, బాలయ్య తిట్ల దండకం ఉన్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య తన పొగరును తగ్గించుకుంటే మంచిదని అన్నారు. ఇప్పటికే హిందూపురం ప్రజల విశ్వాసాన్ని బాలయ్య కోల్పోయారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రేమతో అభిమానులు దగ్గరకొస్తే ఛీదరించుకునే స్వభావం బాలకృష్ణదని గతంలో అతని మానసిక పరిస్థితి బాగోలేదని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆయన మానసిక పరిస్థితి మెరుగుపడ్డాకే ఆయన ప్రజల మధ్య తిరగాలని హిందూపురం ప్రజలు కోరారు.
క్షమాపణలు కోరిన బాలయ్య
విషయం బయటకు పొక్కడంతో బాలకృష్ణ దిద్దుబాటు చర్యలకు దిగారు. కొందరు అల్లరిమూకలని భావించి వారిని వారించడం జరిగిందని చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్నది మీడియా వారని తర్వాత తనకు తెలిసిందని కొత్త కహానీ వినిపించారు బాలకృష్ణ. అంతే తప్ప ఉధ్దేశ పూర్వకంగా చేసింది కాదని వివరించారు. మీడియా మిత్రులు తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.