అల్పుడు... అయ్యన్న వ్యాఖ్యలకు వేమన పద్యంతో హోంమంత్రి సుచరిత స్ట్రాంగ్ కౌంటర్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,పలువురు మంత్రులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచాయి.అయ్యన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద నిరసనకు దిగడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ,దాడులపై ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఇంటిపై వైసీపీ దండయాత్రేనని టీడీపీ ఆరోపిస్తుండగా... గూండాలు,రౌడీ మూకలతో టీడీపీనే తమపై దాడులకు పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి సుచరిత ఈ వ్యవహారంపై స్పందించారు.

జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా...
అయ్యన్నమాటలు వింటే 'అల్పుడెపుడు పలుకు ఆడంబరంబుగాను... సజ్జనుడు పలుకు చల్లగాను..' అనే వేమన పద్యం గుర్తుకొస్తోందని సుచరిత పేర్కొన్నారు.ఒక మహిళపై అయ్యన్న అలా మాట్లాడారంటే అతని సంస్కారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,తనతో పాటు ఇతర మంత్రులపై అయ్యన్న వాడిన భాషను ఆమె తప్పు పట్టారు.తన రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరని ప్రశ్నించారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని... సీఎం జగన్ నిర్ణయం మేరకు హోంమంత్రిని అయ్యానని చెప్పారు.సీఎం ఆదేశిస్తే ఏ క్షణమైనా రాజీనామా చేస్తానని... అంతేగానీ తన రాజీనామా కోరెందుకు అయ్యన్న ఎవరని మండిపడ్డారు.

అది మీ సంస్కారం...
'టీడీపీ నేతలు లా అండ్ ఆర్డర్ గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నారు.వంగవీటి రంగా హత్య మీ హయాంలోనే జరిగింది కదా.చంద్రబాబు హయాంలోనే హోంమంత్రి హత్యకు గురయ్యారు కదా.అప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా.గత టీడీపీ ఐదేళ్ల పాలనలోనే కదా ఒక ఎమ్మెల్యే,ఒక మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైంది. అది శాంతిభద్రతల కిందకు రాదా.అప్పట్లో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగితే... ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిరసన తెలియజేశారు.కానీ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగితే కోడికత్తి అని చంద్రబాబు ఎగతాళి చేశారు.కనీస పరామర్శకు కూడా రాలేదు.ఇది మీ సంస్కారం.' అంటూ సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

చూస్తూ ఊరుకునేది లేదు...
'టీడీపీ పాలన నిజంగా అంత బాగుండి ఉంటే ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండేవారు కాదు.ముఖ్యమంత్రిని పట్టుకుని జైల్లో చిప్పకూడు అని మాట్లాడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జైలుకెళ్లారో ప్రజలకు తెలుసు.అందుకే 151 సీట్లు కట్టబెట్టారు.అది ఓర్చుకోలేక ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వంపై అవాకులు,చవాకులు పేలుతున్నారు.అయ్యన్న అంటే గంజాయి అమ్ముకునే వ్యక్తి అని చెబుతున్నారు.మీరు సమాజానికి పట్టిన ఒక చీడ.వయసుకు తగినట్లు మాట్లాడాలి.నీరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కురదు.ఆత్మాభిమానమే ప్రధానంగా బతుకుతున్న దళిత స్త్రీని నేను.వ్యక్తిగతంగా ఒకరిని కించపరిచే అధికారం మీకెవరిచ్చారు.మీ పాలనలో మహిళలకు ఎంత గౌరవమిచ్చారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏ చర్యలు తీసుకుంటారో చంద్రబాబు ఆలోచించుకోవాలి.ఇలాగే వ్యక్తిగత దూషణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదు.' అని సుచరిత హెచ్చరించారు.












Click it and Unblock the Notifications