కేసీఆర్ చెప్పారు, చర్యలు: జవదేకర్, క్లిప్పింగ్స్: ఎంపీ కేకే
న్యూఢిల్లీ: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత పైన రాజ్యసభలో శుక్రవారం హాట్హాట్గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రసారాల నిలిపివేత పైన కేసీఆర్కు లేఖ రాశానని చెప్పారు. ఇందులో తమకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పారని తెలిపారు.
స్వేచ్ఛలో బాధ్యతలను కూడా మీడియా గుర్తించాలన్నారు. మీడియా స్వయం నియంత్రణ పాటించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేటి సాయంత్రం ఐదు గంటలకు ఎంఎస్ఓలతో సమావేశం ఏర్పాటు చేయనుందని, అందులో ఎవరైనా మీడియాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని నిషేధిస్తామన్నారు. 47 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుని ఎంఎస్ఓల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వెంటనే వారిపై క్రిమినల్ సెక్షన్లపై చర్యతీసుకుంటామన్నారు.
వైయస్లా: సీఎం రమేష్
దేశంలో టీవీ ఛానెల్స్ ఎలాంటి వార్తలు, ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం చూడాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభలో అన్నారు. ఎన్డీటీవీ తమాషాను చూస్తే మీడియా విమర్శలు ఏ రీతిలో ఉంటాయో తెలుస్తాయన్నారు. టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లు మీడియా నియంత్రణ వ్యవస్థను దాటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
తప్పు జరిగిందని, ఆ ఎపిసోడ్ ప్రసారం వల్ల ప్రజాప్రతినిధులు బాధపడ్డారని తెలిసిన తరువాత టీవీ ఛానల్ జరిగిన తప్పిదాన్ని గుర్తించి, క్షమాపణలు కూడా చెప్పాయన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఈనాడు, ఏబీఎన్లను ఎలా ఆపేశారో అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పరిష్కరించండి: టీఎస్సార్
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యముందని ఎంపీ సుబ్బిరామి రెడ్డి అన్నారు. కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయని, చానళ్ల ప్రసారాల నిలిపివేత సమస్యను మంత్రి జవదేకర్ పరిష్కరించాలని టీఎస్సార్ అన్నారు. ప్రభుత్వం, మీడియా మధ్య తలెత్తిన అనవసర తగాదాలు తొలగిపోవాలన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నియంత్రించినట్లే: రేణుక
మీడియాను నియంత్రించాలని చూస్తే ప్రజాస్వామ్యాన్ని నియంత్రించినట్టేనని రేణుకా అన్నారు. ఓ పక్క పోర్న్ సైట్లు విచ్చలవిడిగా ఆపరేట్ అవుతుంటే ఏమీ చేయలేకపోతున్నామని, అలాంటిది మీడియా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని నిషేధిస్తారా? అది సరైన చర్యేనా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడం గర్హనీయమని తెలిపిన ఆమె, తప్పు జరిగితే సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు విధానం ఉందన్నారు. సోషల్ మీడియాలో అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు వస్తున్నాయన్నారు.
క్లిప్పింగ్స్ ఉన్నాయి: కేకే
తెలంగాణ ప్రభుత్వం మీడియా పైన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం లేదని తెరాస ఎంపీ కే కేశవ రావు అన్నారు. రెండు ఛానళ్లను ఆపేయడం సరైన చర్య అన్నారు. ఏపీ మీడియా చానల్స్ అధినేతలు తప్పులు చేస్తారు, కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతారన్నారు. మళ్లీ అవే తప్పులు చేస్తారన్నారు. తెలంగాణలో వీ6, తెలంగాణ న్యూస్ చానళ్లను ఆంధ్రాలో ఆపేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.
చానళ్ల నిలిపివేత సరైనది కాదని ఎవరైనా నిరూపిస్తే తాను రాజ్యసభలోనే ఉరేసుకుంటానని సవాల్ చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల విషయంలో చానళ్లు వాడిన భాష నీచంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులను కించపరిచిన వీడియో క్లిప్పింగులు తన వద్ద ఉన్నాయన్నారు. వాటిని ఒక్కసారి చూసి మాట్లాడాలన్నారు. పత్రికా స్వేచ్ఛకు తాము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదన్నారు.