జగన్ ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసిందా ? మళ్లీ కేంద్రం చేతుల్లోకి బంతి ! ఏం జరగబోతోంది ?
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చినా.. వాటిని అమల్లోకి తీసుకురావడంలో విఫలమవుతున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా రాజధాని తరలింపు కంటే ముందుగానే సీఎం జగన్ విశాఖ వెళ్లి పాలన మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా విశాఖలో రిషికొండను తొలిచేసి క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు అనూహ్యంగా బ్రేక్ వేసింది. దీంతో మరోసారి బంతి కేంద్రం చేతుల్లోకి వెళ్లినట్లయింది.
రాజధానిపై జగన్ వ్యూహాలు
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను ఎంత వేగంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుందో అంతకంత ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఓవైపు కోర్టుల్లో న్యాయపోరాటం, జనంలో రాజకీయ పోరాటం చేస్తూనే మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు వైఎస్ జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిషికొండపై గతంలో ఉన్నపర్యాటక రిసార్ట్ కూల్చివేసి దాని స్ధానంలో మరిన్ని కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇందుకోసం రుషికొండను భారీగా తొలిచేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో హైకోర్టు జోక్యంచేసుకుని గతంలో రిసార్ట్ కూల్చివేసిన స్ధలంలోనే దీన్ని నిర్మించాలని ఆదేశించింది. అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
రుషికొండపై భారీ తవ్వకాలు
విశాఖలోని రుషికొండపై పర్యాటక రిసార్ట్ పునరుద్దరిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం భారీగా తవ్వకాలకు దిగింది. విషయం బయటికి పొక్కకుండా భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టింది. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయలేదు. తాను అనుకున్న విధంగా తవ్వకాలు పూర్తి చేసేసింది. దీన్ని పరిశీలించేందుకు వెళ్లిన విపక్ష నేతల్ని అడ్డుకుంది. చివరికి హైకోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తప్పలేదు. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
రుషికొండపై కేంద్ర సర్వే
రుషికొండపై గతంలో తాము అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్లు హైకోర్టు గుర్తించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అఫిడవిట్ లోనే వెల్లడించింది. దీంతో తవ్వేసి అనుమతి కోరడమేంటని ప్రశ్నించింది. నిన్న జరిగిన విచారణలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు..కేంద్ర సంస్ధలతో సర్వేకు ఆదేశించింది. రుషికొండపై అక్రమ తవ్వకాల్ని నిర్ధారించేందుకు కేంద్ర పర్యాటక, అటవీ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ప్రకటించేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది.
కేంద్రం చేతుల్లో జగన్ షిఫ్టింగ్ ?
హైకోర్టు తాజా నిర్ణయంతో మూడు రాజధానుల ప్రక్రియే కాదు జగన్ విశాఖ తరలివెళ్లే వ్యవహారం కూడా కేంద్రం చేతుల్లోకి వెళ్లినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే రుషికొండపై అక్రమ తవ్వకాలను నిర్ధారించాల్సింది కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అధికారుల బృందమే. ఈ బృందం విశాఖకు వచ్చి రిషికొండ తవ్వకాలపై అధ్యయనం చేసి హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో కేంద్రం వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తే ఫర్వాలేదు. లేకుంటే జగన్ విశాఖ తరలివెళ్లేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లపై దీని ప్రభావం కచ్చితంగా పడటం ఖాయం.