పోలవరం లేని పోలవరం జిల్లా..! ఎన్టీఆర్ తో చెక్ పెట్టిన చంద్రబాబు..!
ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల పునర్ విభజన తప్పులతడకగా ఉందన్న పేరుతో కూటమి సర్కార్ ఆ తేనెతుట్టెను మళ్లీ కదిపింది. గత కొన్ని నెలలుగా జిల్లాల పునర్ విభజన పేరుతో ఉపసంఘం సిఫార్సులు, ప్రజాభిప్రాయ సేకరణలు, కేబినెట్ చర్చలు జరిపింది. చివరకు ఇవాళ మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో మార్కాపురం, రంపచోడవరం, మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉన్నాయి. అయితే ఇందులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. అయితే పోలవరం గ్రామం లేని చోట పోలవరం జిల్లా ఏర్పాటు చేయడంపై జనసేన మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబును కేబినెట్ భేటీలో ప్రశ్నించినట్లు తెలిసింది. పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏమిటని మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి నిర్వాసితులు ఉన్నారనే జిల్లా పేరు అలా మార్చాల్సి వచ్చిందంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు.

అయితే మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబు సమాధానంపై సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. ఈసారి ఎన్టీఆర్ ఊరు లేకుండా ఎన్టీఆర్ జిల్లా పేరు ఉంది కదా అని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ జిల్లాలకు మహానుభావుల పేర్లు ఉన్నాయన్న అంశాన్ని మాత్రమే చూడాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. దీంతో మంత్రులు కూడా ఏమీ మాట్లాడకుండా సరేనన్నారు. ఇదే కేబినెట్ భేటీలో రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. దీంతో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి స్ధానంలో మదనపల్లె వచ్చి చేరింది.












Click it and Unblock the Notifications